Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లను కాంగ్రెస్ గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూడు రాష్ట్రాల కొత్త సీఎంలు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మొదటగా రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్, తర్వాత మధ్యప్రదేశ్ సీఎంగా కమల్నాథ్ల ప్రమాణస్వీకారాలు జరిగాయి. భారీ వర్షం కారణంగా ఛత్తీస్గఢ్ సీఎం ప్రమాణస్వీకారోత్సవం నిర్దేశించిన సమయం కంటే ఆలస్యమైంది. మూడు రాష్ట్రాల సీఎంల ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీతో సహా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, దేవెగౌడ, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్పవార్, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, కర్నాటక సీఎం కుమారస్వామి, డీఎంకే చీఫ్ స్టాలిన్, ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్తో పాటు పాటు పలు పార్టీల నాయకులు హాజరయ్యారు. బీఎస్పీ, తృణముల్ కాంగ్రెస్, ఎస్పీ అధినేతలు మాయావతి, మమతబెనర్జీ, అఖిలేశ్లు మాత్రం హాజరు కాలేదు. రాజస్థాన్, ఎంపీల్లో ఎస్పీ, బీఎస్పీలు కాంగ్రెస్కు మద్దతిచ్చిన విషయం తెలిసిందే.
రాజస్థాన్ సీఎంగా అశోక్గెహ్లాట్ - డిప్యుటీగా సచిన్
రాజస్థాన్ 12వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు డిప్యుటీగా రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలెట్ వ్యవహరించనున్నారు. జైపూర్లోని ప్రఖ్యాత ఆల్బర్ట్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ కళ్యాణ్సింగ్ వారిద్దరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తాజా మాజీ సీఎం వసుంధర రాజే కూడా హాజరయ్యారు. కాగా, రాజస్థాన్కు గెహ్లాట్ గతంలో రెండు సార్లు సీఎంగా పనిచేశారు.
ఎంపీ సీఎంగా కమల్నాథ్ ప్రమాణస్వీకారం
మధ్యప్రదేశ్ రాష్ట్ర 18వ సీఎంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్నాథ్ బాధ్యతలు స్వీకరించారు. భోపాల్లోని జంబూరీ పరేడ్ గ్రౌండ్లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్.. కమల్నాథ్తో ప్రమాణస్వీకారం చేయించారు. వేరే మంత్రులెవరూ ప్రమాణస్వీకారం చేయలేదు. అనంతరం ఆయన రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేశారు. తాజా మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ కూడా కార్యక్రమానికి హాజరైనవారిలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు దిగ్విజరుసింగ్, మల్లిఖార్జున ఖర్గేలు, రాజస్థాన్ కొత్త సీఎం అశోక్ గెహ్లట్, డిప్యుటీ సీఎం సచిన్పైలెట్లు హాజరయ్యారు.
ఛత్తీస్గఢ్ సీఎంగా భూపేశ్ బాఘేల్
ఛత్తీస్గఢ్ సీఎంగా భూపేశ్ బాఘేల్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు టిఎస్ డియో సింగ్, తమ్రద్వాజ్ సాహులు మంత్రులుగా ప్రమాణం చేశారు. బల్బిర్సింగ్ జునేజా ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్పటేల్ వారితో ప్రమాణం చేయించారు. సాయంత్రం 4.30 గంటలకు జరగాల్సిన ఈ కార్యక్రమం భారీ వర్షంకారణంగా వేదికను వేరొక చోటుకు మార్చడంతో ఆలస్యమైంది. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో తాజా మాజీ సీఎం రమణ్సింగ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోతీలాల్ వోరాలు ఉన్నారు.