Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ పెరుగుతున్న ఇంధన ధరలు
- పెట్రోల్పై రూ. 0.20, డీజిల్పై రూ. 0.10 పైసలు పెంపు
న్యూఢిల్లీ: అంతా అనుకున్నట్టుగానే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రో బాదుడు మళ్లీ షురూ అయ్యింది. ఎన్నికలు ముగిసిన రెండో రోజు నుంచే కేంద్రంలోని మోడీ సర్కారు పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతోంది. ఈ కారణంగా గడిచిన వారం రోజుల్లోనే ఇంధన ధరలు మూడోసారి పెరిగాయి. దీంతో, రెండు నెలల క్రితం మాదిరిగానే దేశంలో మరోసారి పెట్రో రేట్లు చుక్కల్ని తాకడం ఖాయంగా కనిపిస్తోంది.అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందడానికి నెలన్నర రోజుల పాటు ధరలను తగ్గించిన మోడీ సర్కారు.. తదనంతర పరిణామాలతో దేశ ప్రజలకు మరోసారి పెట్రో వాత పెట్టడానికి సిద్దమైంది. ఇందులో భాగంగానే సోమవారం దేశవ్యాప్తంగా పెట్రోల్పై లీటరుకు రూ. 0.20 పైసలు, డీజిల్ రూ. 0.10 పైసలను పెంచింది. సవరించిన ధరల ప్రకారం.. ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ. 76.15 కాగా, డీజిల్ రూ. 64.47 గా నమోదైంది. ఇవే ధరలు ముంబయిలో రూ. 76.15, రూ. 67.47 కాగా, హైదరాబాద్లో రూ. 74.80, రూ. 70.07కు చేరుకున్నాయి.
కేంద్రంలోని మోడీ సర్కారు ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు నుంచి పెట్రో ధరలను వరుసగా రెండు నెలల పాటు పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన పెట్రోల్ ధరలు సామాన్య జనాలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. పెంచిన పెట్రోల్ ధరల ప్రభావం నిత్యావసర వస్తువుల మీద కూడా పడింది. దీంతో, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. అయినా వెనక్కి తగ్గని బీజేపీ సర్కారు.. పెరిగిన రేట్లను రూపాయి పతనం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదలను సాకుగా చూపింది. కానీ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఇంధన ధరలు దిగి రావడం ప్రారంభమైంది. గడిచిన నెలన్నర రోజుల్లో పెట్రోల్పై దాదాపు 15 శాతం వరకు తగ్గాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘోర ఓటమి పాలైంది. దీంతో, గతంలో మాదిరిగానే చమురు ధరలను మళ్లీ పెంచుతోంది.