Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11వేలలో 88 స్టార్టప్లకే పన్ను మినహాయింపు
- కఠినమైన స్క్రీనింగ్తో వేలసంఖ్యలో దరఖాస్తుల తిరస్కరణ
న్యూఢిల్లీ : ఎన్నో ఆశలతో, ఎంతో ఉత్సాహంతో 'స్టార్టప్'లను ప్రారంభిస్తున్న యువతను కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. ఎంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన 'స్టార్టప్ ఇండియా' పథకానికి కేవలం 4శాతం దరఖాస్తుదారులను ఎంపికచేసి మోడీ సర్కార్ చేతులు దులుపుకుంది. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు అందుకున్న స్టార్టప్లు 11,422 ఉండగా, అందులో కేవలం 2197 దరఖాస్తులను తుది పరిశీలనకు స్వీకరించారు. దీంట్లో కేవలం 88 స్టార్టప్లకు పన్ను మినహాయింపు కల్పించారు. 'డిపార్ట్మెంట్ ఆఫ్ పాలసీ, ప్రమోషన్' శాఖ (డీఐపీపీ) కఠిన నిబంధనలు, స్క్రీనింగ్ విధానాలు కారణంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయనీ, పన్ను మినహాయింపు దక్కలేదనీ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కొద్ది రోజుల క్రితం డీఐపీపీ ఉన్నతాధికారులు స్క్రీనింగ్ విధానాన్ని సరళతరం చేయాల్సి వచ్చింది. కొత్తగా మార్గదర్శకాల్ని రూపొందించారు. దీని ప్రకారం, డీఐపీపీ వెబ్సైట్కు దరఖాస్తు చేసుకున్నాక, 45రోజుల్లోగా క్లెయిమ్ను పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఆర్భాటంగా ప్రకటించారు...
2015 స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సందర్భంగా ప్రధాని మోడీ 'స్టార్టప్ ఇండియా' పన్ను మినహాయింపు పథకాన్ని ప్రకటించారు. ఈపథకం కింద ఎంపికైన స్టార్టప్కు మొదటి 30నెలలపాటు ఆదాపు పన్ను నుంచి మినహాయింపు కల్పిస్తున్నారు. అలాగే పెట్టుబడి సేకరణపై పన్ను మినహాయింపు దక్కుతుంది. కొత్తగా స్టార్టప్లు ప్రారంభించిన యువత ఈ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. దీంట్లో ఎంపికైతే తమ స్టార్టప్కు పెట్టుబడుల సేకరణ సులభతరమవుతుందని భావించారు. దీంతో పెద్ద సంఖ్యలో 'డిపార్ట్మెంట్ పాలసీ, ప్రమోషన్' శాఖకు దరఖాస్తులు వచ్చాయి. కానీ వారి ఆశలకు తగ్గట్టుగా పథకాన్ని కేంద్రం అమలుజేయలేకపోయింది. స్టార్టప్ ఇండియా పథకంపై మోడీ సర్కార్ చేసిన ఆర్భాటానికి క్షేత్రస్థాయిలో వాస్తవానికి చాలా తేడా కనపబడుతోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కఠినమైన స్క్రీనింగ్ విధానంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులును తిరస్కరించారని యువత ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.