Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- కాపులుప్పాడలో 175 ఎకరాల అప్పగింత
- 1350 ఎకరాలకు 'క్లౌడ్ సిటీ'గా నామకరణం
విశాఖ: 'డేటా సెంటర్'తోనే రాష్ట్ర నూతన ఆర్థిక భవిష్యత్తు నిర్ణయించబడుతుందని, రూ.70 వేల కోట్ల పెట్టుబడి ఒకేసారి తీసుకొచ్చామని, 'అదానీ గ్రూప్నకు నేను మార్కెటింగ్ పార్టనర్'గా రాష్ట్రంలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను' అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. దేశంలోని పారిశ్రామిక దిగ్గజ సంస్థ 'అదానీ గ్రూప్'నకు డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ పార్క్ పేరుతో విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం కాపులుప్పాడలో 175 ఎకరాలను అప్పగిస్తూ అక్కడ శిలాఫలకం వేసిన అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ 'విజయనగరం జిల్లా నుంచి కాపులుప్పాడ కొండల ప్రదేశానికి రాగానే చుట్టూ ఒక రౌండ్ వేశాను.. సిలికాన్ వ్యాలీ కూడా చాలదు.. అత్యంత అందమైన, క్రియాశీలకమైన ప్రదేశం.. పర్యావరణం రీత్యా ఇది అత్యంత శక్తిమంతమైన ప్రదేశం.. దీన్ని మీ చేతుల్లో పెడుతున్నాను.. మీకు మేనేజింగ్ పార్టనర్గా రాష్ట్రంలో పనిచేస్తాను.. మీపై ఒత్తిడి పెడతాను.. నేటి నుంచే పని ప్రారంభించాలి' అంటూ.. ఆదానీ గ్రూప్ ఎమ్డీ రాజేష్ అదానీ వైపు చూస్తూ ప్రకటించారు. ఒక ప్రభుత్వం చేతిలో డేటా ఎంతుంది అనే దాన్ని బట్టే సంపద చేకూరుతుందని, డేటాతో వండర్స్ సృష్టించవచ్చునని అన్నారు. తాను సైబరాబాద్ను నిర్మించానని హైదరాబాద్, సికింద్రాబాద్ సరసన నేడు సైబరాబాద్ చేరిందన్నారు. విశాఖలో అదానీ డేటా సెంటర్తో సాంకేతిక విప్లవ నగరంగా మారుతుందని కితాబిచ్చారు.
ఏపీలో 11.5 శాతం గ్రోత్రేట్తో ముందంజలో ఉన్నామని, భవిష్యత్లో 15 శాతానికి తీసుకెళ్లడానికి ఐటీకి కావాల్సిన మానవ వనరుల కొరతను అధిగమించడానికే డేటా సెంటర్ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కాపులుప్పాడలోని 1,350 ఎకరాల ఐదు కొండల ప్రదేశాన్ని 'క్లౌడ్ సిటీ'గా నామకరణం చేసినట్టు చెప్పారు. కాపులుప్పాడ (విశాఖ సిటీ) నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు ప్రదేశం వరకూ మంచి పేరును నిర్ణయించాలంటూ ప్రేక్షకులుగా విచ్చేసిన వివిధ కాలేజీల విద్యార్థులకు సూచించారు. దేశంలోనే డేటా సెంటర్కు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని తెలిపారు. విశాఖలో డేటాసెంటర్తో నాలెడ్జ్ ఎకానమీ, కాపులుప్పాడకు అవతలి వైపున భోగాపురం ఎయిర్ పోర్టుతో అమెరికాలోని వర్జీనియా మాదిరిగా వైజాగ్ సిటీ మారుతుందన్నారు. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుతో భవిష్యత్తులో 25 వేల ఐటీ ఉద్యోగాలు రానున్నాయన్నారు. మరో 80 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు.
2019 జనవరిలో అదానీతో ఐటీ మంత్రి లోకేష్ ఎంఓయూ చేసుకోగా... ఫిబ్రవరి 14న అదానీ కంపెనీ నిర్మాణ పనులకు అంగీకరించడంతో శంకుస్థాపన చేశామని, మంత్రి లోకేష్ కృషేనని చంద్రబాబు తెలిపారు. ఇన్నోవేషన్స్కే తన పాలనలో ప్రాధాన్యమిస్తానని, గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు టెలికం రంగం గుత్తాధిపత్యంపై సిఫారసులు చేసి టెలికం రంగంలో డీ రెగ్యులరైజేషన్ చేయడంతో నేడు అందరి చేతుల్లో సెల్ఫోన్లు వచ్చాయని గుర్తు చేశారు. 20ఏండ్ల క్రితం నుంచి మన దేశం, రాష్ట్రం నుంచి ప్రపంచం వైపు పరుగులు తీశామని, తాను అధికారం చేపట్టడం వల్ల ప్రపంచమే పెట్టుబడులతో ఆంధ్రాకు నేడు వస్తుందని, ఇదే తాను త్వరలో రాష్ట్రంలో సృష్టించబోయే 'న్యూ ఎకానమీ' అంటూ సీఎం వివరించారు.
రుషికొండలో కాండ్యుయెంట్ ఐటి సంస్థ కోసం రూ.145 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ను ప్రారంభించిన అనంతరం కాపులుప్పాడకు విచ్చేసిన చంద్రబాబు ఏపీజే అబ్దుల్ కలాం కల్చరల్ కన్వెన్షన్ సెంటర్, మహిళా ఎంఎస్ఎంఈ ఇంటర్నేషనల్ పార్కు, జీవీఎంసీ స్యూయెజ్ ప్లాంట్ తదితర 5 ప్రాజెక్టుల శిలాఫలకాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అదానీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ అదానీ, ఐటీ శాఖ మంత్రి లోకేష్, గంటా శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ కె.విజయనంద్, సీఈఓ (యుఎస్) సుదీప్తా భట్టాచార్య, జిల్లా కలెక్టర్ కె.భాస్కర్, జెడ్పీ ఛైర్పర్సన్ లాలం భవాని, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు పాల్గొన్నారు.