Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభలోకి పౌరసత్వ బిల్లు ప్రవేశపెట్టకపోవడంపై మేఘాలయ సీఎం
గువహతి : పౌరసత్వ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టకపోవడాన్ని ప్రజల విజయంగా మేఘాలయ సీఎం కొన్రాడ్ సంగ్మా అభివర్ణించారు. ఇది బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రజలు, రాజకీయ పార్టీల గెలుపని అన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు సంయుక్తంగా చేపట్టిన ఆందోళనల వల్లనే ఎన్డీయే ప్రభుత్వం ఆ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు వెనుకడుగు వేసిందని తెలిపారు. 'ఇది కచ్చితంగా ఒక ఉద్విగభరిత సందర్భం. ఈ రీజియన్ కోసం, దాని అస్తిత్వాన్ని కాపాడటం కోసం మనమందరం ఐక్యంగా నిలబడ్డామ'ని వివరించారు. ఈ వివాదాస్పద బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వారితోపాటు నిలిచిన రాజకీయ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్న ఈశాన్య భారతంలో మొదటి ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మానే కావడం గమనార్హం. ఈ బిల్లు విషయమై అవసరమైతే బీజేపీ ప్రభుత్వంతో పొత్తును తెగతెంపులు చేసుకోవడానికీ వెనుకాడమని సంగ్మా తెలిపారు. మేఘాలయాలో ఎన్పీపీ చీఫ్ సంగ్మా ప్రభుత్వానికి బీజేపీ పార్టీ మద్దతునిస్తుండగా.. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో బీజేపీ ప్రభుత్వానికి ఎన్పీపీ మద్దతునిస్తున్న విషయం తెలిసిందే.