Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల ఫీజులను పెంచి పేద, మధ్యతరగతి విద్యార్థులపై భారాన్ని మోపితే సహించేది లేదని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. డిగ్రీ ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒకే రకమైన ఫీజు విధానం పేరుతో ఫీజులు పెంచి యాజమాన్యాలకు లాభం చేకూర్చే విధానం సరైంది కాదని తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేయడమే అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న ఫీజులు కట్టలేక విద్యార్థులు సతమతమవుతున్నారని తెలిపారు. స్కాలర్షిప్లు సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఐదేండ్లుగా ప్రభుత్వం సకాలంలో పూర్తిస్థాయిలో రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదని తెలిపారు. ఫీజులు పెంచి విద్యార్థులపై భారాన్ని మోపాలని, యాజమాన్యాలు, ఉన్నత విద్యామండలి చేస్తున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఫీజులు పెంచాల్సి వస్తే ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు కాలేజీల్లో సౌకర్యాలు, బోధన అంశాలపై ఉన్నత విద్యామండలి దృష్టి సారించాలని కోరారు. ఫీజులు పెంచే ఆలోచనను విరమించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని తెలిపారు.