Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్లో కాలేజ్ ప్రిన్సిపాల్, వీపీల నిర్ణయం
- బీజేపీ గూండాల బెదిరింపుల వల్లే కళాశాల ట్రస్టు.. కార్యక్రమాన్ని రద్దు చేసింది : జిగేశ్
అహ్మదాబాద్ : దళిత నేత, వాడ్గాం ఎమ్మెల్యే జిగేశ్ మేవానీ గుజరాత్లో అహ్మదాబాద్లోని హెచ్కే ఆర్ట్స్ కాలేజీ వార్షిక కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. కానీ, కాలేజీ ఆడిటోరియాన్ని ఈ వేడుకలకు వినియోగించరాదని యాజమాన్యం ఆదేశించడంతో కార్యక్రమం రద్దయింది. ఒక పార్టీ నేతల ఒత్తిళ్లతోనే కాలేజీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నదని ఆరోపించిన కాలేజీ ఇన్చార్జీ ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్ షా నైతిక ప్రమాణాలను పేర్కొంటూ రాజీనామా చేశారు. హేమంత్ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే కళాశాల ఇన్చార్జీ వైస్ ప్రిన్సిపాల్ మోహన్భారు పర్మార్ కూడా కాలేజీ నడుపుతున్న బ్రహ్మచారి వాడి ట్రస్ట్కు రాజీనామా లేఖను సమర్పించారు. ఈ కాలేజీలో హేమంత్ 15ఏండ్లుగా, మోహన్భారు పదేండ్లుగా బోధిస్తున్నారు.
తన రాజీనామాపై హేమంత్ మాట్లాడుతూ.. 'నేను వ్యక్తిగత స్వేచ్ఛను ప్రేమిస్తా. ఈ కాలేజీ పూర్వ విద్యార్థి జిగేశ్ హాజరుకావాల్సిన ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ట్రస్టు ఆదివారం తెలిపింది. ఆడిటోరియం వినియోగాన్ని నిరాకరిస్తూ ట్రస్టీ 'ప్రస్తుత రాజకీయ పరిస్థితులు' అని ఒకే ఒక్క కారణం చెప్పిం ద'ని అన్నారు. ప్రస్తుత రాజకీయాలు రాజ్యాంగం కల్పించిన మాట్లాడే హక్కును నులిమేస్తున్నాయని, వీటికి అధికారవర్గాల నుంచీ మద్దతు లభిస్తున్నదని షా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇవాళ్టి(శుక్రవారం) వేడుకలకు ఆడిటోరియం వినియోగానికి అనుమతినివ్వకపోవడం వెనుక ఒక పార్టీకి చెందిన విద్యార్థి నేతల ఒత్తిళ్లు, బెదిరింపులున్నట్టు తేలికగానే అర్థమవుతున్నదని వివరించారు.
బీజేపీ గూండాల బెదిరింపుల వల్లే : జిగేశ్
బీజేపీ గూండాల బెదిరింపుల వల్లే హెచ్కే ఆర్ట్స్ కాలేజీ ట్రస్టీ.. ఈ కార్యక్రమాన్ని రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే జిగేశ్ మేవానీ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో బాబా సాహెబ్ జీవితం, ఆయన ఆశయాల గురించి మాట్లాడాలనుకున్నారని ఆయన వివరించారు. నైతిక ప్రమాణాలపై రాజీనామా చేసిన ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్ షాకు సెల్యూట్ అని తెలిపారు.