Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడులను నివారించడంలో మోడీ సర్కారు విఫలం
- ఎన్ఏఎఫ్ఎస్జే సమావేశంలో బృందా కరత్ వెల్లడి
- ప్రభుత్వ భూములు ఎస్సీ, ఎస్టీలకు పంచాలి: కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి పీఎస్ కృష్ణన్
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో:
దేశంలో దళిత పోరాటాలకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందాకరత్ స్పష్టం చేశారు. 70 ఏండ్ల స్వాతంత్ర దేశంలో ఇంకా సామాజిక న్యాయం కోసం మాట్లాడాల్సి రావడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు దళిత, గిరిజన, వెనుక బడిన వర్గాలకు న్యాయం చేయడంలో విఫలం అయ్యాయని విమర్శించారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో నేషనల్ యాక్షన్ ఫర్ సోషల్ జస్టిస్ (ఎన్ఎఎఫ్ఎస్జె) వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీవర్గాల సమస్యలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి పీఎస్ కృష్ణన్ తయారు చేసిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీవర్గాలు ఉన్నత కులాలతో సమానంగా వృద్ధి చెందానికి కావాల్సిన రూట్ మ్యాప్, రిపోర్టును విడుదల చేశారు. ఈ రిపోర్టులో సంబంధిత చట్టాలు, విధానాలు ఆయా వర్గాల అభివృద్ధికి అవసరమవుతాయని ఆయన వివరించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బృందా కరత్ మాట్లాడుతూ దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల పోరాటాలకు తమ పార్టీ సాయం అందిస్తుందని తెలిపారు. హక్కుల కోసం జరిగే ఉద్యమాల్లో తమ పార్టీ కూడా భాగస్వామ్యం అవుతుందని హామీనిచ్చారు. దళిత, గిరిజన, మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని చెప్పారు. గోరక్షక్ పేరుతో దళిత, మైనార్టీలపై దాడులకు ఒడిగడుతున్నారని, హత్యలు చేస్తున్నారని విమర్శించారు. కానీ ప్రభుత్వాలు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు.
పీఎస్ కృష్ణన్ మాట్లాడుతూ దళిత, గిరిజన, వెనుకబడిన, మైనార్టీ వర్గాల అభివృద్ధికి తగిన చర్యలతో కూడిన రిపోర్టును అన్ని పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయింపులు చేయాలని అన్నారు. ఆ కేటాయింపులు కూడా ఉన్నత వర్గాలతో సమానంగా వెనుకబడిన అణగారినవర్గాలు రావడానికి అవసరమైన పథకాలపై ఖర్చు చేయాలని చెప్పారు. అవసరమైతే ఎన్నికల ముందే జాతీయ స్థాయిలో దీనికి అవసరమైన ఆదేశాలను ఇవ్వాలని అన్నారు. వచ్చే కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత తొలి పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రభుత్వ పరిధిలో ఉన్న భూములను, భూదాన ఉద్యమంలో ఇచ్చిన భూములను ఎస్సీ వర్గాలకు పంచాలని, ఎస్సీలతో పాటు భూమి లేని ఇతర వర్గాలకు కూడా పంచాలని అన్నారు. అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య(ఏఐడీఆర్ఎఫ్) జాతీయ అధ్యక్షుడు కె ఆనంద రావు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు సంబంధించి కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.
దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు రావల్సిన బడ్జెట్ మొత్తాన్ని ఆయా వర్గాలకే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఏఎఫ్ఎస్జేె ఛైర్మన్ నాయక్ చంద్, ప్రధాన కార్యదర్శి దర్శన్ సింగ్, ఏపీ భవన్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.