Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యల పరిష్కారంలో మోడీ విఫలం
- అబద్ధాలతో గత ఎన్నికల్లో గట్టెక్కిన బీజేపీ
- విద్యారంగానికి జీడీపీలో 6 శాతం, కేంద్ర బడ్జెట్లో 10 శాతం
- కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యకు డిమాండ్ : ఢిల్లీలో ఐదు విద్యార్థి సంఘాల భారీ ర్యాలీలో కన్నయ్య కుమార్, వీపీి సాను
- ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళి
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
''మోడీ ప్రభుత్వం సూట్... బూట్... లూట్ సర్కారు. ప్రధాని మోడీ నాలుగన్నరేండ్ల పాలన కార్పొరేట్లకు ఊడిగం చేయడానికే సరిపోయింది. దేశ ప్రజల సమస్యలు గాలికొదిలేశారు. నియంతృత్వ విధానాలతో దేశంలోని ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేశారు. ఇక ఈ మోడీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. అందుకు అందరూ సిద్ధం కావాలి'' అంటూ విద్యార్థి సంఘాల నేతలు గర్జించారు. సోమవారం నాడిక్కడ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐడీఎస్ఓ, ఏఐఎస్బీ, పీఎస్్యూ విద్యార్థి సంఘాల నేతృత్వంలో భారీ ర్యాలీ జరిగింది. స్థానిక రాంలీలా మైదానం నుంచి జంతర్మంతర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో విద్యార్థి సంఘాల నేతలు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. ''విద్యారంగాన్ని కాపాడాలి... దేశాన్ని రక్షించాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి'' నినాదంతో సాగిన ఈ ర్యాలీలో ''మోడీ హఠాÄవో... దేశ్ బచావో. విద్యా వ్యతిరేక విధానాలు నశించాలి. మతోన్మాద మోడీ సర్కార్ను ఓడించాలి'' అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఆందోళనలో తొలుత పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 44 మంది సీిఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులర్పిస్తూ, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను మాట్లాడుతూ దేశంలోని పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, ప్రజల హక్కులపై దాడి జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి రోజు ఆందోళనలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే దేశ రాజధానిలో పోరాటం చేస్తున్నామని అన్నారు. మోడీ సర్కార్ విద్యా, దళిత, గిరిజన, మైనార్టీ, కిసాన్, యువత, కార్మిక వర్గాలకు వ్యతిరేకంగా పని చేస్తుందని విమర్శించారు. ఒక పక్క ఎన్నికల ప్రచారాలు ప్రారంభమైయ్యాయని, మరోపక్క ఉగ్రవాద దాడి జరిగిందని తెలిపారు. గత వాజ్పేరు ప్రభుత్వంలో కూడా ఇలానే జరిగిందని గుర్తు చేశారు. రోజూ ఉగ్రవాదులు, సైనికుల్ని హతమార్చుతున్నారని, సైనికులు, ఉగ్రవాదుల్ని కాల్చుతున్నారని విమర్శించారు. ఇలాంటి ఘటనల్లో 300 పైగా సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించటంలో మోడీ సర్కార్ విఫలం అయ్యిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ నిధులతో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత సాధారణ విద్యా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, విద్యా రంగానికి జీడీపీలో 6 శాతం, కేంద్ర బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు.
రెండు కోట్ల ఉద్యోగాలేవీ : కన్నయ్య కుమార్
విద్యారంగ సమస్యల పరిష్కారంలో మోడీ సర్కార్ పూర్తిగా విఫలం అయ్యిందని జేఎన్యూ ఎస్యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రూ.14 లక్షలు బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని అబద్ధాలు చెప్పి గత ఎన్నికల్లో మోడీ పరివారం గెలిచిందని దుయ్యబట్టారు. రెండు కోట్లు ఉద్యోగాలేవని ప్రశ్నించారు. మోడీ హామీ ప్రకారం దేశంలో యువతకు పది కోట్లు ఉద్యోగాలు రావల్సి ఉందని, కానీ పది లక్షలు కూడా రాలేదని విమర్శించారు. దేశంలో ఉద్యమాలు చేస్తే అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని, దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై నిసిగ్గుగా లారీచార్జీ చేశారని అన్నారు. ఈ సర్కార్కు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమిస్తున్నారని, దళిత, గిరిజన, మైనార్టీ, వెనుకబడిన వర్గాలు ఆందోళను చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ అతనే దేశంగా అనుకుంటున్నారని, కానీ దేశమంటే ప్రజలని చెప్పారు. దేశంలోని కార్పొరేట్ నిధులు స్వీకరిస్తున్నా పార్టీల్లో బీజేపీ అగ్రభాగాన ఉందని, 85 శాతం కార్పొరేట్ నిధులు బీజేపీ వసూలు చేసిందని విమర్శించారు. అంతేకాదు రామమందిర నిర్మాణం పేరుతో కోట్ల రూపాయలు చందాలు వసూలు చేశారని, వాటిని బీజేపీ కార్యక్రమాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. తాము ఆరోపణలు చేయడం లేదని, వాస్తవాలనే తాము చెబుతున్నామని అన్నారు. దేశం అభివృద్ధి చెందిందని టీవీల్లోనూ, పత్రికల్లోనూ అవాస్తవ ప్రకటనలు ఇస్తున్నారని విమర్శించారు. దేశంలో కనీస విద్య దొరకకపోతే అభివృద్ధి ఎక్కడీ అని ప్రశ్నించారు. మోడీ పరీక్షలు గురించి చెప్పనప్పటి నుంచే ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయని ఎద్దేవా చేశారు. జేఎన్యూ ఘటనలో దేశ ద్రోహం కేసులు నమోదు చేశారని, కానీ ఇప్పటివరకు రుజువు చేయలేకపోయారని అన్నారు. విద్యార్థులపై దాడి చేయడం తప్ప మోడీ సర్కార్కు మరో ఎజెండా లేదని విమర్శించారు. మోడీ సర్కార్ ప్రజలను హిందూ, ముస్లిం పేరుతో విడగొట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఇటీవల ఉగ్రవాద దాడుల్లో హతమైన జవాన్లలో అన్ని మతాల వారు ఉన్నారని గుర్తు చేశారు. అందరు కలిసి కట్టుగా ఉద్యమించాలని అన్నారు.
విద్యార్థుల డిమాండ్లు రాజకీయ ఎజెండా కావాలి
విద్యార్థుల డిమాండ్లు రాజకీయ ఎజెండా కావాలని జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకురాలు దీప్షితాదార్ వెల్లడించారు. ఏబీవీపీ వంటి మతవాద సంస్థలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విద్యార్థి లోకం జంతర్మంతర్ వైపు కదం తొక్కిందని అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ను వెంటనే విడుదల చేయాలన్నారు. ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శువం బెనర్జీ, విక్కీ మహేశ్వరీ మాట్లాడుతూ అందరికీి ఉద్యోగాలు కల్పించేందుకు భగత్సింగ్ జాతీయ ఉద్యోగ హామీ చట్టం(బీఎన్ఈజీఏ) చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థల్లో కూడా సామాజిక న్యాయం హామీ ఇవ్వాలని, సమాఖ్య విద్యా విధానాన్ని పరిరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్, ఏఐడీిఎస్ఓ ప్రధాన కార్యదర్శి అశోక్ మిత్రా, ఏఐఎస్బీ కార్యదర్శి సౌమ్యదీప్ సర్కార్, పీఎస్యూ కన్వీనర్ ఎన్ఎం సఫీయుల్లా, ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యుడు నితీష్ నారాయణ్, ఎస్ఎఫ్ఐ ఢిల్లీ కార్యదర్శి దుగ్గిరాల శ్రీక్రిష్ణ, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు వల్లీ ఉల్లా ఖాద్రీ, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి అశోక్, రమేష్ పాల్గొన్నారు.
విద్యా కాషాయీకరణ ఆపాలి
కోట రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి
దేశవ్యాప్తంగా విద్యా కాషాయీకరణ ఆపాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ తరఫున జంతర్మంతర్ ర్యాలీలో 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తి నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. పోరాటాలతోనే ప్రభుత్వాల మెడలు వంచుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.