Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ స్లోగన్
- ప్రచార కమిటీలకు హైకమాండ్ ఆదేశం
- తెలంగాణ నుంచి ఉత్తమ్, కోమటిరెడ్డి, విజయశాంతి హాజరు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్తంగా వీస్తున్న మోడీ వ్యతిరేక పవనాలను ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తన ఖాతాలోకి వేసుకోవాలని భావిస్తున్నది. భారతీయ జనతా పార్టీ సర్కారు గత నాలుగున్నర సంవత్సరాల్లో చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాలని యోచిస్తున్నది. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ(వస్తు సేవల పన్ను)లతో దెబ్బతిన్న వర్గాల అభిమానాన్ని చూరగొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. దాంతోపాటు రాఫెల్ డీల్తో అశ్రిత పక్షపాతానికి పాల్పడిన మోడీ సర్కారును ఎన్నికల క్షేత్రంలో ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా గత కొద్ది రోజులుగా పార్టీ అంతర్గతంగా తీవ్రమైన చర్చలు జరుపుతున్నది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడు కీలకమైన హిందీ రాష్ట్రాల్లో పాగా వేసిన హస్తం పార్టీ, ఓడిన రాష్ట్రాలో సైతం ఎందుకు విజయం చేకూరలేదన్న విధంగా కూడా మంతనాలు సాగిస్తున్నది. ఇదే విషయంపై పార్టీలోని సీనియర్ నేతలు వార్రూమ్లో పలు రాష్ట్రాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం రాష్ట్రాల పీసీసీ ప్రెసిడెంట్లు, కార్యనిర్వాహక అధ్యక్షులతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించిన రాహుల్ గాంధీ బృందం తాజాగా రాష్ట్ర ప్రచార కమిటీలతో భేటీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం లోక్సభ ఎన్నికల్లో ప్రచారాంశాలపై ఢిల్లీలోని వార్రూమ్లో ఏఐసీసీ జాతీయ ప్రచార కమిటీ చైర్మెన్ ఆనంద్ శర్మ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రచార కమిటీ చైర్మెన్ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, స్టార్ క్యాంపెనయిర్ విజయశాంతి పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు తన హయాంలో సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆనంద్ శర్మ కమిటీ సభ్యులకు తెలిపారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా జాతీయ సమస్యలే చర్చకు వచ్చే విధంగా క్యాంపెయిన్ నడపాని సూచించినట్టు తెలిసింది. మోడీ వర్సెస్ రాహుల్ ó అనే విధంగా ఎన్నికల పోరు జరగాలని చెప్పారు. రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు తెరపైకి పెద్దగా రానివ్వద్దని మాట్లాడినట్టు వినికిడి. అయితే, కీలక అంశాలపై మాత్రం కాంగ్రెస్ గెలిస్తేనే నెరవేరుతాయని జనాల్లోకి తీసుకెళ్ళాలని చర్చించినట్టు సమాచారం. అందుకు తగిన విధంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీలు, ద్వితీయ శ్రేణి నాయకత్వం జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పెద్ద నోట్లరద్దు, జీఎస్టీ కారణంగా దేశంలోని చాలా రంగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతగానో దెబ్బతిన్నట్టు వెల్లడించారు. దెబ్బతిన్న ప్రజానీకంతో సమావేశాలు నిర్వహించాలని, నష్టనివారణకు సంబంధించిన అంశాలపై నివేదికలు రూపొందించి పార్టీలో యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్నారు. ఈ అంశాలను పక్కాగా ఎన్నికల్లో తీసుకెళితే విజయం పెద్ద సమస్య ఏమీ కాదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. జీఎస్టీ కారణంగా చేనేత రంగం పూర్తిగా ధ్వంసం అయిందని తెలంగాణలో చేనేత ప్రభావిత ప్రాంతాల్లో ఈ విషయంపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు. ఇక రాఫెల్ ఒప్పందంలో డబ్బులు చేతులు మారిన విషయాన్ని మధ్య తరగతి ప్రజానీకంలోకి తీసుకు వెళ్ళాలని అన్నారు. మోడీ ప్రభుత్వానికి మధ్య తరగతివర్గాలల్లో బలమైన ఓటు బ్యాంకు ఉందని ఆనంద్ శర్మ సూచించారు. రాఫెల్ విషయాన్ని ఎంతమేరకు తీసుకెళ్తే, కాంగ్రెస్కు విజయ అవకాశాలు అంత దగ్గర అవుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉందని... అటువంటి ప్రదేశాల్లో ఆ పార్టీకి బీజేపీతో ఉన్న తెరచాటు స్నేహాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలని పేర్కొన్నారు. మైనారిటీ ఓట్లను రాబట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని వివరించారు.
సోనియా, రాహుల్ రమ్మని కోరాం: కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ రాష్ట్రానికి ఎప్పుడు రావాలనే దానిపై సమావేశంలో చర్చించినట్టు రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. వార్రూం చర్చల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏఐసీసీ పర్యటన వివరాలు ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీయేనని... ఈ విషయంపై రాష్ట్ర ప్రజానీకం మదిలో ఆమె ఉన్నారని చెప్పారు. అందుకే, తెలంగాణ ప్రచారానికి సోనియా గాంధీని తీసుకురావాలని సీనియర్ నేతలకు విజ్ఞప్తి చేసినట్టు రాజగోపాల్రెడ్డి చెప్పారు.
తెలంగాణ భవన్లో రాహుల్ లంచ్!
తెలంగాణ భవన్ క్యాంటీన్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం లంచ్ చేశారు. భవన్లోని వీఐపీ క్యాంటీన్లో అపనీ బాత్ రాహుల్కే సాత్ కార్యక్రమంలో భాగంగా పలు రంగాలకు చెందిన చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. మొబైల్, చేనేత, ఆటో మొబైల్, శానిటరీ పాడ్స్, టూరిజం, హౌటల్, సోలార్ ఏసీ, ఇకో సిల్క్ రంగాల చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలు, సూచనలను ఆయన తెలుసుకున్నారు. లంచ్ చేస్తూ... సుమారు నలభై నిముషాల పాటు ఈ భేటీ జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరపున తీసుకోవాల్సిన విధానాలు, మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై చర్చ జరిగినట్టు భేటీలో పాల్గొన్నవారు మీడియాకు తెలిపారు. రాహుల్ గాంధీతో సమావేశం తమకు ఆనందాన్ని కలిగించిందన్న వ్యాపారులు అభిప్రాయపడ్డారు.