Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి లోక్పాల్ పినాకి చంద్రఘోష్ ముందు అనేక సవాళ్లు
- సంచలన తీర్పుల్లో భాగస్వామిగా ఘోష్
న్యూఢిల్లీ : ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తొలి లోక్పాల్గా జస్టిస్ పినాకి చంద్రఘోష్ నియమించబడ్డారు. 2013లో లోక్పాల్ చట్టం చేసిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు తాత్సారం చేసిన ప్రభుత్వం ప్రస్తుత ఎన్నికల సమయంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రాజకీయ, అధికారిక వర్గాలో పెచ్చరిల్లుతున్న అవినీతిని చంద్రఘోష్ ఏ విధంగా నిరోధిస్తారన్న చర్చ ప్రస్తుతం సాగుతోంది. జస్టిస్ చంద్రఘోష్.. పలువురు రాజకీయ నాయకులపై వచ్చిన అవినీతి కేసులను విచారించి వారికి శిక్ష విధించిన ధర్మాసనాల్లో సభ్యునిగా ఉన్నారు. 'కష్టతరమైన, రాజకీయంగా బలమైన వ్యక్తులకు సంబంధించిన కేసులను విచారించే సమయంలో మనం ఎంతో మనోనిబ్బరంగా ఉండాలి' అని మాజీ చీఫ్ జస్టిస్ జెఎస్ ఖేహర్ రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సమావేశం సందర్భంగా చంద్రఘోష్కు సూచించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, అమె సన్నిహితురాలు శశికలకు సంబంధించిన అవినీతి కేసును ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 142 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలపై చర్చ సమయంలో, 1992 బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్కె అద్వానీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి రోజువారి విచారణకు రావాలన్న ఆదేశించిన సుప్రీం ధర్మాసనాల్లో ఘోష్ సభ్యునిగా ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనల్లో స్థానిక నాయకుల ఫొటోలను వాడకూడదని తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఈయన సభ్యునిగా ఉన్నారు. ఒకానొక సందర్భంగా ఘోష్ తన సహచరులను కూడా వదల్లేదు. కోర్టు ఉల్లంఘన కేసులో కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కణ్ణన్ను జైలుకు పంపించిన ధర్మాసనంలో ఈయన ఒకరు. అయితే ఈ కేసులో తాను అమాయకుడినని కణ్ణన్ పలు రాజ్యాంగ సంస్థలకు విన్నవించుకున్నారు. అ సమయంలో చట్టం అందరికీ ఒకటి గానే ఉంటుందని, ఎవరూ చట్టానికి అతీతులు కాదని, జస్టిస్ కణ్ణన్ కూడా ఒక సాధారణ పౌరుడిగానే పరిగణించబడతారని ఘోష్ కుండబద్దలు కొట్టినట్టు వ్యాఖ్యానించారు. దక్షిణ భారత్లో సామాజిక పరంగా చాలా సున్నితమైన జల్లికట్టు, పోటీల నిరోధం తదితర అంశాలలో ఘోష్ న్యాయమూర్తిగా తీర్పులిచ్చారు. రాజీవ్గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న వారిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదని ఆయన తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టిపారేశారు.
కుటుంబ నేపథ్యం
చంద్రఘోష్ కోల్కతా మాజీ చీఫ్ జస్టిస్ శంబు కుమారుడు. ఈయన తన కుటుంబంలో ఐదో తరానికి చెందిన న్యాయమూర్తిగా ఉన్నారు. 1867లో కోల్కతాలోని సదర్ దివానీ అదాలత్కు మొట్టమొదటి చీఫ్ జస్టిస్గా వ్యవహరించిన హారా చంద్రఘోష్ కూడా ఈ కుటుంబానికి చెందిన వారే. 76 ఏళ్ల పినాకి చంద్రఘోష్ కోల్కతా యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పొందారు. 1976లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1997లో కోల్కతా కోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా ఈయన నియమించబడ్డారు. అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయబడ్డారు. 2012లో చీఫ్ జస్టిస్గా బాధ్యతలు స్వీకరించారు. 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన పినాకి చంద్ర ఘోష్ 2017లో పదవీ విరమణ చేశారు. అనంతరం ఆయనను జాతీయ న్యాయ సేవా సంస్థలో సభ్యుడిగా నామినేట్ చేశారు. ప్రస్తుతం ఆయన జాతీయ మానవ హక్కుల సంఘంలో సభ్యుడిగా ఉన్నారు.
నిజమైన చౌకీదార్గా..
అయితే ప్రస్తుతం చంద్రఘోష్ను ప్రభుత్వం లోక్పాల్గా నియమించింది. ఈయన ఈ పదవికి తగిన న్యాయం చేస్తారన్న విషయం అతని చరిత్రను చూస్తే అర్ధం అవుతోంది. 2013లో లోక్పాల్ చట్టం చేసినప్పటికీ పాలకులకు ఉన్న భయం వలన గత ఐదు సంవత్సరాలుగా లోక్పాల్ను నియమించ కుండా ప్రభుత్వం తాత్సారం చేసింది. అయితే సరిగ్గా ఎన్నికల సమయంలో ఈ నిర్ణయం వెలు వడింది. మరో రెండు నెలల్లో కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటు కానుంది. 'చౌకీదార్' అనే పదంపై ప్రస్తు తం చర్చ నడుస్తున్న సమయంలో ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు నిజమైన చౌకీదార్(కాపలాదారుడు)గా పినాకి చంద్రఘోష్ బాధ్యతలు చేపడుతున్నారు. లోక్పాల్గా ఈయన పనితీరు ఎలా ఉండబోతుందో రాబోవు రోజుల్లో చూడాల్సివుంది.