Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోర్డు ఎగ్జామ్ రాయకుండా అడ్డుకున్న అగ్రవర్ణం
- బీజేపీ పాలిత గుజరాత్లో ఘటన
గాంధీనగర్ : గుజరాత్లో కులసర్పం మరోసారి కోరలు చాచింది. అగ్రవర్ణం అమ్మాయితో సన్నిహితంగా మెలుగుతున్నాడన్న అనుమానంతో 12వ తరగతి చదువుతున్న దళిత విద్యార్థిని చెట్టుకు కట్టేసి దారుణంగా బాదారు. బోర్డు ఎగ్జామ్ రాయకుండా అడ్డుకున్నారు. రాస్తే ప్రాణాలతో బతకవు అని బెదిరించారు. అంతేకాదు, చదువు మానుకుని కూలి పని చేసుకోవాలని ఆదేశించారు. ఈ కులదురహంకార ఘటన బీజేపీ పాలిత గుజరాత్లోని పాటన్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుడు మిత్కుమార్ నరేశ్భారు చావ్డా(17) చేసిన ఫిర్యాదు ప్రకారం.. మెహసానాలోని మా ఇంటి నుంచి దినోజ్ గ్రామంలోని పరీక్షా కేంద్రానికి మధ్యాహ్నం ఒంటిగంటకల్లా చేరుకున్నాను. ఎగ్జామ్ సెంటర్ బయట వేచి ఉండగా.. ముఖపరిచయం ఉన్న బస్ కండక్టర్ రమేశ్ పటేల్ కొంచెం పని ఉన్నది బయటికి రమ్మని నన్ను తీసుకెళ్లాడు. ఆయన ద్విచక్రవాహనంపై ఎదురుచూస్తున్న మరో వ్యక్తి దగ్గరకు నన్ను తీసుకెళ్లాడు. వారిద్దరు గొరాడ్ గ్రామ పొలిమేరకు తీసుకెళ్లార'ని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అక్కడికి తీసుకెళ్లాక తన కొడుకుని చెట్టుకు కట్టేసి తీవ్రంగా బాదారని నరేశ్భారు తల్లి తరుణ తెలిపారు. కారణమేంటని అడిగితే.. తన కొడుకు చదువుకోవద్దని, పరీక్షలు రాయకూడదని తిడుతూ.. లేబర్ పని చేయాలని ఆదేశించినట్టు ఆమె వివరించారు. కాగా, అగ్రవర్ణం అమ్మాయితో తన కొడుకు సన్నిహితంగా ఉన్నా డని వస్తున్న ఆరోపణలను ఆమె కొట్టేసింది. స్నానం చేస్తుండగా కొడుకు గాయా లను చూసిన ఆమె నరేశ్ను అడగ్గా ఈ ఘటన వివరాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం ఆమె నరేశ్ను ఆస్పత్రికి తీసుకెళ్లి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దళితుల రక్తంతో హౌళీ : జిగేశ్
11వ తరగతి చదువుతున్న అగ్రవర్ణం అమ్మాయితో నరేశ్భారు స్నేహం చేస్తున్నాడన్న అనుమానంతో వారు ఈ దాడి చేశారని చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన అనంతరం ఎమ్మెల్యే జిగేశ్ మేవానీ బుధవారం అన్నారు. ఆ అమ్మాయి బంధువులే దళిత బాలుడిని బాదారని, పరీక్షలు రాస్తే చంపేస్తారని బెదిరించారని తెలిపారు. ఈసారి గుజరాత్లో హౌళీ పండుగనాడు వారు(బీజేపీ) దళితుల రక్తంతో హౌళీ ఆడారని అన్నారు. 48 గంటల్లో నిందితులను అరెస్టు చేయకుంటే ఆందోళన చేపడుతామని, ఏప్రిల్ 14న బీజేపీ నాయకులెవరూ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలహారం వేయలేరని హెచ్చరించారు.