Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల కమిషన్కు ఏచూరి డిమాండ్
న్యూఢిల్లీ:ఎన్నికలు స్వేచ్ఛగా జరిపించడం ద్వారా ప్రజాస్వామ్యంపై భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) నమ్మకం కలిగించాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి సూచించారు. త్రిపుర పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ల ఆక్రమణ, నిబంధనల ఉల్లంఘన పెద్దఎత్తున జరిగినట్టు ఎన్నికల సంఘం దర్యాప్తులో వెల్లడైందని ఆయన గుర్తు చేశారు. 464 బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని, ఓటర్లు తమ ఓటుహక్కు స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని ఏచూరి డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఏప్రిల్ 23న పోలింగ్ జరిగే త్రిపుర తూర్పు నియోజకవర్గంలో ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటింగ్లో పాల్గొనేలా భద్రత కల్పించాలని ఏచూరి డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్కున్న స్వతంత్రతతో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారమున్నందున ప్రభుత్వాలు అడ్డంకులు కల్పించలేవని ఆయన తెలిపారు. పోలింగ్ బూత్ల నుంచి వేలాదిమంది ఓట్లు వేయకుండానే వెనక్కి వెళ్లడంపై తాము చేసిన విజ్ఞప్తిపై స్పందించి, స్వతంత్రంగా పరిశీలించి ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు హామీ ఇచ్చిన అధికారులకు కృతజ్ఞతలు చెబుతున్నట్టు ఏచూరి తెలిపారు. తమపై భౌతిక దాడి జరుగుతుందని లేదా ప్రాణాలు పోతాయన్న భయంలేకుండా ఓటర్లంతా తమకు ఇష్టమైన ప్రతినిధిని ఎన్నుకునే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఈసీఐపై ఉన్నదని ఏచూరి స్పష్టం చేశారు.