Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరువు ప్రస్తావన లేకుండానే మోడీ ప్రసంగం
బెంగళూరు: కర్నాటకలోని దక్షణ ప్రాంతంలో లోక్సభ ఎన్నికలు ఈ నెల 18న ముగిశాయి. ఇక ఉత్తర కర్నాటక వంతు వచ్చింది. 23న 14 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చిక్కోడీ, బాగల్కోట్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో గురువారం పాల్గొన్నారు. బాగల్కోట్లో ప్రధాని మాట్లాడుతూ.. 'కాంగ్రెస్, జేడీ(ఎస్) ఓటు బ్యాంకు ఎక్కడ ఉన్నదో చెప్పండి? బాగల్కోట్లోనా లేదా బాలాకోట్లోనా? కాంగ్రెస్, జేడీ(ఎస్) నిర్ణయించుకోవాలి' అన్నారు. చిక్కోడీలో మోడీ ప్రసంగం ఇలా సాగింది. 'భారత్ మాతా కీ జై నినాదాన్ని గౌరవిస్తుందా? లేక దేశాన్ని ముక్కులు చేసి నాశనం చేస్తుందో మీ ఓటు నిర్ణయిస్తుంది...'
మోడీ, అమిత్షా, ఆ పార్టీ అభ్యర్థులు జాతీయవాదం, హిందూమతం, సాధారణ పౌరులను ప్రభావితంచేసేలా వారి మనోభావాలు, భావోద్వేగాలను ఉపయోగించుకుంటున్నారన్నది బహిరంగ రహస్యమే. కాంగ్రెస్-జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నంలో బీజేపీ రాష్ట్ర ప్రతినిధులు పదేపదే ప్రస్తావిస్తున్న అంశమైన మహాడైయి నది వివాదం గురించి మోడీ తన ప్రసంగంలో ఎలాంటి ప్రస్తావనా తీసుకురాలేదు. ఉత్తర కర్నాటక తీవ్ర కరువు పరస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నది. రైతుల ఆత్మహత్యలు, తీవ్ర నిరుద్యోగ సమస్య పీడిస్తున్నది. అక్షరాస్యతలో పూర్తిగా వెనుక బడి వున్నది. 'అభివృద్ధి'కి సమాధానం లేదు? కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై ప్రస్తావనలేదు. ఈ సమస్యలను పట్టించుకోని ప్రధాని అమరవీరులైన సైనికులను బహిరంగంగా రాజకీయ అంశంగా ముందుకు తెచ్చారు. అంటే ఆయనకు రైతు ఆత్మహత్యలు పట్టవు, సంక్షోభ ఊబి నుంచి వ్యవసాయాన్ని బయటపడేసే ఉద్దేశమూలేదు. జాతీయవాదాన్ని పెంపొందించాలని చౌకీదారు కోరుకుంటున్న ఉత్తర కర్నాటకలోని చాలా ప్రాంతాలు ప్రత్యేకించి బాగల్కోట్, చిక్కోడీలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
ఉత్తర కర్నాటకలో కరువు తీవ్రం
కర్నాటక రాష్ట్ర ప్రకృతి విపత్తు సహాయ కేంద్రం ఇచ్చిన వివరాల ప్రకారం ఉత్తర కర్నాటకలో 176లో 86 తాలూకాల్లో గత రబీ, ఖరీఫ్ సీజన్లలో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 24 జిల్లాలు కరువు ప్రభావిత ప్రాంతాలు. వర్షాభావం, కరువుతో గతేడాది దాదాపు రూ.16,662 కోట్లు నష్టం సంభవించినట్టు అంచనా. ఈ ప్రాంతంలో వరుసగా 14 ఏండ్లుగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఆధారపడుతున్నారు. కాగా, బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఈ పథకం కింద పనిదినాలనూ కుదిస్తున్నది. వేతనాల కోసం పేదలు నెలల కొద్దీ ఎదురుచూడాల్సి వస్తున్నది. ఈ పథకం కింద కర్నాటక కు కేంద్రం రూ. 2,049 కోట్లు చెల్లించాల్సిన ఉండగా రూ. 117 కోట్లు మంజూరు చేసినట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈ ఏడాది ఫిబ్రవరి 12న రాష్ట్ర అసెంబ్లీలో చెప్పారు. బాగల్కోట్లో ఎదుగుదల సరిగాలేని ఐదేండ్లలోపు చిన్నారు లు 45.7శాతం, చిక్కోడీలో 36.7శాతం ఉన్నట్టు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో జరిగిన సభలో మోడీ ఈ సమస్యల జోలికివెళ్లలేదు. ఈ ప్రాంతాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా కేంద్రం ఎందుకు ప్రకటించలేదు? ఉపాధి హామీ పథకం వేతనాలను ఎందుకు చెల్లించటంలేదు? మోడీ పెద్దపెద్ద పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ.. ఇక్కడి చిన్నారులు పోషకాహార లోపంతో ఎందుకు బాధపడుతున్నారు? రైతుల ఆత్మహత్యలు పెరుగుతుంటే.. వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలేమిటి? ఈ ప్రశ్నలకు బీజేపీ నుంచి సమాధానం కావాలని అక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు.