Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నంద్యాల : ఇటీవల మృతిచెందిన కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పివై రెడ్డి కుటుంబ సభ్యులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం పరామర్శించారు. నంద్యాలలోని ఎస్పివైరెడ్డి ఇంటికి వెళ్లి. ఎస్పివైరెడ్డి సతీమణి పార్వతమ్మ, అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి, కూతుళ్లు సుజల, అరవిందరాణిలను ఆయన పరామర్శించారు. ఎస్పివైరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాధి వద్ద పుష్షగుచ్చం ఉంచారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎస్పివైరెడ్డి స్వయంకృషితో ఉన్నత స్థాయికి ఎదిగారని, పేదల పట్ల ఎంతో అభిమానంగా ఉండేవారని వివరించారు. నంద్యాలలో రూపాయికి పప్పు, రొట్టే పెట్టి పేదల ఆకలి తీర్చారన్నారు. అన్నదాన కార్యక్రమాలను నిర్వహించిన పేదల మనిషి అని, . నంది పరిశ్రమలు స్థాపించి పారిశ్రామికుడిగా దేశంలోనే పేరు సంపాదించి నంద్యాలకు కూడా పేరు తెచ్చారని చెప్పారు. రైతులకు అందుబాటులో ఉంటూ రైతు బాంధవుడుగా పేరుగాంచారన్నారు. మంచి మనస్సున్న ఎస్పివైరెడ్డి జనసేన పార్టీలోకి రావడానికి సమ్మతించడంతో వెంటనే ఆహ్వానించి ఆయనకు ఎంపి టికెట్ ఇచ్చినట్లు చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు కూడా శ్రీశైలం, బనగానపల్లె, నంద్యాల అసెంబ్లీ స్థానాలు కేటాయించి గౌరవించామని చెప్పారు. అనారోగ్య కారణాలతో ఎస్పివైరెడ్డి మృతి ఈ ప్రాంతంలో జనసేన పార్టీకి తీరని నష్టమన్నారు. ఎస్పివైరెడ్డి కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించడంతో పాటు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర,్ స్థానిక నాయకులు, ఎస్పివైరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.