Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 25 నుంచి 30 మధ్య అందుబాటులో గొగోయ్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా ఒక వెకేషన్ బెంచ్లో సీజేఐ భాగం కానున్నారు. ఈ ఘనతను ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సొంతం చేసుకోనున్నారు. సుప్రీంకోర్టుకు ఈనెల 13 నుంచి జూన్ 30 వరకు వేసవి సెలవులను(సమ్మర్ వెకేషన్) ప్రకటించిన విషయం తెలిసిందే. సాధారణంగా సుప్రీంకోర్టుకు వెకేషన్లో అత్యవసర విచారణల నిమిత్తం సర్వోన్నత న్యాయస్థానం ఇతర జడ్జీలతో(సీజేఐను మినహాయించి) ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేస్తారు. అయితే సీజేఐ మాత్రం ఏ ధర్మాసనంలోనూ భాగస్వామ్యం కారు. అయితే ఈనెల 25 నుంచి 30 పిటిషన్ల విచారణ నిమిత్తం ఏర్పాటైన ధర్మాసనంలో రంజన్ గొగోయ్ భాగం కానున్నారని సుప్రీంకోర్టు తన నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఈ బెంచ్లో ఆయనతో పాటు జస్టిస్ ఎం ఆర్ షా కూడా ఉండనున్నారు. అయితే లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈనెల 23న ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం ఏర్పడబోయే తరుణంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నందున సీజేఐ అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్లలో న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, సంజీవ్ ఖన్నా లతో కూడిన మొదటి ధర్మాసనం నేటి నుంచి 20 వరకు పిటిషన్లను విచారించనున్నది.