Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎస్ అధికారి ఇంట్లోనే తయారీ యూనిట్
- ముగ్గురు విదేశీయుల అరెస్టు
న్యూఢిల్లీ : రూ.1000 కోట్లకు పైగా విలువైన అతిపెద్ద డ్రగ్స్ తయారీ యూనిట్ను గ్రేటర్ నోడియాలోని ఓ ఐపీఎస్ అధికారి ఇంట్లో అధికారులు గురువారం కనుగొన్నారు. ఇద్దరు నైజీరియన్లను, ఒక సౌత్ ఆఫ్రికా మహిళను అరెస్టు చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ మాధవ్సింగ్ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ఐపీఎస్ అధికారి ఇంట్లో నిర్వహిస్తున్న డ్రగ్స్ తయారీ కేంద్రంలో 1818 కిలోల సుడోఫిడ్రైన్ను స్వాధీనం చేసుకున్నారు. గత మూడేండ్లుగా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన 31 ఏండ్ల ప్రయాణికురాలు నామ్సా లుటాలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి జోహన్స్బర్గ్ మీదుగా దుబాయి వెళ్లే విమానం కోసం వెళ్లగా, అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 24.7 కిలోల సుడోఫెడ్రైన్ డ్రగ్ బ్యాగుతో ఆమె పట్టుబడటంతో విషయం వెలుగుచూసింది. ఆమెను విచారించగా, గ్రేటర్ నోయిడాలో ఇద్దరు నైజీరియన్లు ఈ బ్యాగును తనకు ఇచ్చినట్టు చెప్పింది. ఆ బ్యాగును జోహన్స్బర్గ్లో అప్పగిస్తే అధిక మొత్తంలో డబ్బు ఇస్తామని చెప్పినట్టు తెలిపింది. ఆమెను తెలిపిన వివరాల ప్రకారం ఎన్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వివిధ మార్గాల ద్వారా అక్రమంగా సేకరించిన రసాయన పదార్థాల ద్వారా ఈ డ్రగ్స్ను తయారు చేసి, రహస్య పద్ధతిలో ఢిల్లీతోపాటు విదేశాలకు పంపిస్తున్నట్టు నిందితులు విచారణలో తెలిపారు. ఇదిలావుండగా, ఆ ఇంటి యజమాని యూపీ పోలీసు శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగంలో పనిచేస్తున్నారు. ఆయనను అధికారులు సంప్రదించగా, మధ్యవర్తుల ద్వారా ఇల్లు అద్దెకిచ్చానని, అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదని వివరణ ఇచ్చారు.