Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌంటింగ్ సమీపిస్తున్న కొద్దీ రైతుల్లో ఆందోళన
అమరావతి : సార్వత్రిక ఎన్నికల ఫలితాల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజధాని రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇబ్బందులు తప్పవనే భయం వారిలో పెరుగుతోంది. నలుగురు రైతులు కలిసిన ప్రతిచోటా ఇదే చర్చ జరుగుతోంది. రైతులు, వ్యవసాయ కార్మికుల భవితవ్యంతో ముడిపడిన ప్రాజెక్టు కావడంతో అందరి చర్చా దీని చుట్టే తిరుగుతోంది. మరోవైపు రాజధాని పేరుతో నిర్మాణ రంగం పెరిగింది. వందలకోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇలా పెట్టుబడులు పెట్టినవారు కూడా ఫలితాల అనంతరం రాజధాని భవితవ్యంపైనే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా రాజధాని ఏర్పాటు చేసిన సమయంలో 2018 నాటికి పూర్తి చేస్తానని చంద్రబాబునాయుడు ప్రకటించారు. 2019 ఎన్నికల నాటికి రాజధాని నిర్మించి చూపిస్తాననీ తెలిపారు. 2015 మార్చిలో రాజధాని పర్యటనకు వచ్చిన ప్రతిపక్ష నేత రైతుల విలువైన భూములు తీసుకున్నారని, తాము అధికారంలోకి వస్తే రాజధానిలో ప్రభుత్వ భవనాలకు తగినంత మినహా మిగిలిన భూమంతా రైతులకు ఇచ్చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇప్పటి వరకూ పూలింగును వ్యతిరేకించిన రైతులకు ఇబ్బందులు తప్పవనే ఆందోళన వారిలో ఉంది, ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, రాయపూడితోపాటు మందడంలో పలువురు రైతులు ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. సుప్రీం కోర్టులోనూ కేసులు వేశారు. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న పూలింగు ప్రక్రియపై రాయపూడితోపాటు పలు గ్రామాలకు చెందిన రైతులు ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో రాజధాని కోసం ఇస్తామన్న అప్పును ప్రపంచబ్యాంకు నిలిపేసింది. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. పెనుమాక, ఉండవల్లి రైతులు భూములు ఇవ్వకపోవడంతో కీలకమైన సీడ్యాక్సెస్ రోడ్డు మధ్యలోనే నిలిచిపోయింది.
దీనిపై ఎన్నిసార్లు చర్చలు జరిపినా రైతులు అంగీకరించలేదు. రైతులు భూములు ఇవ్వకపోవడంతో రాజధాని ప్రాజెక్టు పనులకు అడ్డంకిగా ఉంటుందని సీఎం సమీక్షల్లో అసహనం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకొస్తే పూలింగు ప్రక్రియను వ్యతిరేకించిన తమపై ఒత్తిడి పెరుగుతుందని రైతులు ఆందోళనతో ఉన్నారు. ఇప్పటికే కోర్టుల కోసం, తమపై ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడిపై ప్రచారం చేసేందుకు కోట్ల రూపాయలు వెచ్చించారు. ఇప్పుడు వారందరూ ఆందోళనతో ఉన్నారు. పలువురు రైతులు భూసమీకరణ ప్రక్రియ వ్యవహారంలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. ప్రభుత్వం మారితే ఇప్పుడు వారిపై ఒత్తిడి పెరుగుతుందనే ఆందోళనతో ఉన్నారు. దీనికితోడు భూములను వెనక్కు తీసుకుంటారని, నష్టపోవాల్సి ఉంటుందని తెలుగుదేశం అనుకూల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భవన సముదాయాలు కట్టే ప్రాంతం మినహా మిగిలిన భూమంతా వెనక్కు ఇస్తామని జగన్ చెప్పారని, వైసిపి అధికారంలోకి వస్తే చేసే అవకాశం ఉందనీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎక్కువమంది రైతులు మాత్రం ఎవరొచ్చినా రాజధాని మాత్రం కదిలే ప్రసక్తి ఉండకపోవచ్చని, రెండు పార్టీల విధానాలు ఒకే విధంగా ఉంటాయని, అంత తొందరగా రాజధానిని మార్చే ఆలోచన చేయకపోవచ్చనీ అంటున్నారు. రాజధాని ప్రాంతానికి చెందిన వైసీపీ అనుకూల రైతులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం తమకు రావాల్సిన పరిహారాన్ని ఇచ్చి భూములు తీసుకుంటే ఇబ్బంది లేదని, అడ్డగోలుగా తీసుకోవడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 23న ఫలితాలు రాజధానిలో రైతులకు కీలకంగా మారాయి. ఫలితాలు వచ్చేదాన్ని బట్టి అక్కడ రైతులు, రాజధాని భవితవ్యం ఆధారపడి ఉంది. రాజకీయకోణంలో రైతులు ఆందోళన ఒక విధంగా ఉంటే పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి భవనాలు నిర్మించిన బిల్డర్ల ఆందోళన మరో విధంగా ఉంది. రాజధానికి ఆనుకుని ఉన్న తాడేపలి, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో వందల కోట్ల పెట్టుబడులు పెట్టి నిర్మా ణాలు చేపట్టారు. ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న పలు పెద్ద నిర్మాణ రంగ సంస్థలకు రూ.80 కోట్ల వరకూ రాయితీలు కల్పించింది. పెద్దపెట్టుబడిదారులకు ఇబ్బంది లేకపోయినా చిన్నచిన్న వ్యాపారాలు చేసే వారికి ఎన్నికలు ప్రాణసంకటంగా మారనున్నాయి.