Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 64కు చేరిన 'ఫణి' మృతుల సంఖ్య
- పదిహేను రోజులు కావస్తున్నా కనీస సౌకర్యాల కొరత
- ఆందోళన బాట పట్టిన బాధితులు
భువనేశ్వర్ : ఈ నెల 3న ఒడిషాను అతలాకుతలం చేసిన 'ఫణి' మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నది. ఆదివారం ఆయా జిల్లాలలో మరణించిన 21 మందితో కలిపి రాష్ట్రంలో ఫణి తుఫాను ధాటికి మరణించిన మృతుల సంఖ్య 64కు చేరింది. అత్యధికంగా పూరి జిల్లా నుంచి 39 మంది చనిపోగా.. కుర్దా (9) కటక్ (6), మయూర్బంజ్ (4), కేంద్రపరా (3), జజ్పూర్ (3) జిల్లాల నుంచి మరణాలు నమోదైనట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. తుఫాను ధాటికి దాదాపు 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులై పునరావాస శిబిరాలలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఫణి సృష్టించిన విధ్వంసం ముగిసి పదిహేను రోజులు కావస్తున్నా బాధితులకు సహాయక, పునరావాస చర్యలు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఎన్నికల బిజిలో గడుపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సర్కారు తుఫాను బాధితులను ఆదుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తోందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫణి విధ్వంసానికి రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఓ అంచనా. అయితే, ఇండ్లు శాశ్వతంగా కోల్పోయిన వారికి కొత్త ఇండ్లు కట్టిస్తామని నవీన్ పట్నాయక్ హామీ ఇచ్చారు. కానీ, ఇంతవరకూ ఎంత మంది నిరాశ్రయులయ్యారనేదానిపై ప్రభుత్వం వద్ద కచ్చితమైన సమాచారం లేదు. దీనిపై ఈ నెల 15 వరకు నివేదిక అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. బాధితులకు ఇండ్ల నిర్మాణం, పునరావాస చర్యల కింద రూ. 7 వేల కోట్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కాగా పునరావాస శిబిరాలలో తమకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదని తుఫాను బాధితులు వాపోతున్నారు. తాగునీరు, ఆహారం సరైన సమయానికి అందించక పస్తులుంటున్నామని.. పది రోజులు గడిచినా కరెంటు సేవలు పునరుద్ధరించకపోవడంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆరోపిస్తున్నారు.
సహాయక చర్యలను చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీని కారణంగా రోజుల తరబడి తాము ఇక్కడే ఉండాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుఫాను కారణంగా తాము సర్వం కోల్పోతే అధికారులు మాత్రం ఇంకా నష్టం అంచనా వేయడంలో అలక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై భువనేశ్వర్, పూరి, కటక్, కుర్దా జిల్లాలలో బాధితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. పునరావాస సౌకర్యాలను తక్షణమే మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఫణి ధాటికి దాదాపు తీరం వెంబడి ఉన్న 14 జిల్లాలలోని 18,200 గ్రామాలు, 52 చిన్న పట్టణాలలో ఐదు లక్షల మంది నిరాశ్రయులయ్యారు.