Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 200 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలి : సీపీఐ(ఎం)
కోల్కతా : రాష్ట్రంలోని పోలీసుల యంత్రాంగం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తోందని సీపీఐ(ఎం) విమర్శించింది. ఆదివారం పశ్చిబెంగాల్లో జరిగిన ఆరో విడత లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కార్యకర్తలు అధికారుల సాయంతో దాదాపు 200 పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్కు పాల్పడ్డారని, ఆ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. దీంతో పాటు తామ్లుక్ లోక్సభ నియోజకవర్గంలోని నందిగ్రామ్, హల్దియా ప్రాంతాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర నేతలు ఎన్నికల సంఘం అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. బంకురా లోక్సభ నియోజకవర్గంలో 25, బిష్ణుపూర్లో 150, సాల్బొని నియోజకవర్గంలో 20 పోలింగ్ కేంద్రాలను తృణమూల్ కార్యకర్తలు తమ అధీనంలోకి తీసుకొని రిగ్గింగ్కు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ బంకురా డిప్యూటీ కమిషనర్ను తొలగించాలని ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం పోలింగ్ నిర్వహించిన 8 లోక్సభ నియోజకవర్గాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలను మోహరించామని ఈసీ తెలిపింది. అయితే చాలా కేంద్రాల్లో కేంద్ర బలగాలకు బదులుగా రాష్ట్ర పోలీసులను వినియోగించినట్లు సమాచారం. ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అనంతరం సిపిఎం నేత రబిన్దేబ్ మీడియాతో మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి తృణమూల్ కార్యకర్తలు తామ్లక్, బంకురా నియోజకవర్గాలకు వచ్చారని సాక్షాత్తూ ఎస్పియే అంగీకరించారని అంటూ, తమ ఫిర్యాదుపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఇసిని డిమాండ్ చేశారు.