Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ)తో సమాచారం పంచుకోవడంపై నిటి అయోగ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని ఈసీ తెలిపింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ పలు ప్రాంతాల్లో పాల్గొనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పీఎంఓకు సమాచారం అందించడంపై ఈసీకి ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంలో నిటి అయోగ్ కోడ్ ఉల్లంఘించలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీనిపై దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది. అధికారిక పర్యటనల్లో భాగంగా ప్రచారం నిర్వహించడాన్ని నిషేధిస్తూ కేంద్ర మంత్రులపై ఆంక్షలున్నాయని, వీటి నుంచి మాత్రం ప్రధాన మంత్రికి మినహాయింపు ఉంటుందని సీనియర్ డిప్యుటీ ఎన్నికల అధికారి సందీప్ సక్సేనా విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రధాన మంత్రికి ఈ మినహాయింపును 2014, అక్టోబర్ నుంచి కల్పించారు. ప్రధానికి మినహాయింపు అనేది ఒక్క సారి కాదని అది స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అని సక్సేనా అన్నారు. అయితే నిటి అయోగ్.. పీఎంఓతో రాజకీయ సమాచారాన్ని పంచుకోలేదని, కేవలం జిల్లాస్థాయి సమాచారాన్ని మాత్రమే చేరవేసిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పీఎంఓతో నిటి అయోగ్ సమాచారాన్ని పంచుకున్నదని కాంగ్రెస్, ఆప్లు చేసిన ఆరోపణలతో స్పందించిన ఈసీ.. నిటి అయోగ్ సీఈఓ అమితాబ్కాంత్కు ఈనెల 4న లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే మోడీపై ఇప్పటికే దాఖలైన పలు కోడ్ ఉల్లంఘన కేసుల్లో క్లీన్ చీట్ ఇచ్చిన ఈసీ తాజాగా నిటి అయోగ్ విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించడం గమనార్హం.