Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కోడ్' ఉన్నా బీజేపీకి అందిన ప్రభుత్వ సమాచారం
- అడిగిందే తడవు అన్నట్టు వ్యవహరించిన కలెక్టర్లు
- సహకరించిన నిటి ఆయోగ్ అధికారులు
- స్క్రోల్.ఇన్ విచారణలో వెల్లడి
న్యూఢిల్లీ : ప్రభుత్వ అధికారులు రాజకీయ పార్టీలకు చెందిన వ్యవహారాల్లో తలదూర్చడం నిబంధనలకు విరుద్ధం. అదే విధంగా ఎన్నికల సమయంలో పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని, అధికారులను వినియోగించుకోవడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. అయితే ఇక్కడ ఏకంగా బీజేపీ మ్యానిఫెస్టో రూపకల్పనకు ప్రభుత్వ అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన అధికారిక సమాచారం అందించారు. దీంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని అంతా కోడ్ అమల్లో ఉన్నా కూడా కలెక్టర్లు బీజేపీకి అందించారు. బీజేపీ చేపట్టిన ఇటువంటి చట్ట విరుద్ధమైన అంశం 'స్క్రోల్.ఇన్' అనే మీడియా విచారణలో తేలింది. ప్రచార సన్నాహాల్లో భాగంగా ఎన్నికలకు ముందు వివిధ ప్రాంతాల్లో మోడీ పర్యటించిన సందర్భంగా కేంద్ర పథకాలకు సంబంధించిన సమాచారాన్ని పంపాలని ఆయా జిల్లాలకు చెందిన కలెక్టర్లు కోరారు. వారు కోరిందే ఆలస్యం అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ అధికారులు సమాచారాన్ని అంతా ఈమెయిల్ రూపంలో అందించారు. ఈ నేరపూరిత కార్యక్రమంలో వాణిజ్య శాఖ కూడా పాల్గొందని హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 'ఇన్వెస్టు ఇండియా', 'స్టార్టప్ ఇండియా' పథకాలను సంబంధించిన వివరాలను తెలపాలని ఆస్తా గ్రోవర్ అనే పెట్టుబడి విశ్లేషకుడు వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖకు మార్చి 28వ తేదీన ఈమెయిల్ పంపడమే దీనికి నిదర్శనం. స్టార్టప్ ఇండియా విజన్-2024కు సంబంధించిన వివరాలను ఆయన కోరారు. ఇది సరిగ్గా 2019 సాధారణ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మ్యానిఫెస్టో విడుదలకు 12 రోజుల మందు జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక సీనియర్ అధికారి బయటపెట్టారని ఈనెల 10న విడుదల చేసిన నివేదికలో స్క్రోల్.ఇన్ తెలిపింది. అనంతరం బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో కూడా స్టార్టప్ ఇండియా విజన్- 2024కు చెందిన వివరాలు కనిపించాయి. ఇది జరగకముందే ఎన్నికల కోడ్ మార్చి 10 నుంచి అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఇలా పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని అడగడం నిషేదం.
అడిగిందే ఆలస్యం అన్నట్లు కలెక్టర్లు
మంత్రులుగా ఉన్నవారు తమ రాజకీయ పర్యటనలను అధికార యంత్రాంగాన్ని వినియోగించుకోకూడదు. ప్రభుత్వ అధికారులు, యంత్రాగాన్ని తమ రాజకీయ అవసరాల కోసం వినియోగించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనికి సంబంధించిన మరో ఈమెయిల్ను స్క్రోల్.ఇన్ తన విచారణలో బయటపెట్టింది. 'త్వరలో కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఆయా ప్రాంతాలకు సంబంధించి చారిత్రక అంశాలు, సంస్కృతి, పంటలు, పరిశ్రమలు, తదితర అంశాలకు సంబంధించిన వివరాలు పంపించండి' అని ఏప్రిల్ 8న నిటి ఆయోగ్ అధికారి పింకీ కపూర్ చండీగఢ్ పాలనాధికారి సలహాదారుడు, ఢిల్లీ, పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. అయితే ఇది కోడ్ ఉల్లంఘన కిందకు రాదని కపూర్ ఖండించారు. ఇదేరకంగా బిజెపి పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలోని గోండియా, లాతూర్ జిల్లాల అధికారులు తమ జిల్లాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపించారు. ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించాల్సిన రిటర్నింట్ అధికారులైన కలెక్టర్లే ఇలా కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని స్క్రోల్.ఇన్ పేర్కొంది.
గతంలో ఇందిరకు జరిగిందేమిటి?
బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ ఘనకార్యం ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 కింద కచ్చితంగా శిక్షింపదగిన నేరమే అని విశ్లేషకులు చెబుతున్నారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఇటువంటి చట్ట ఉల్లంఘన ఘటనే చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచార నిర్వాహకుడిగా ప్రభుత్వ అధికారిని ఇంధిరా నియమించుకున్నారు. దీనికి తోడు సభల ఏర్పాట్లు చూడాలని స్థానిక అధికారులు, పోలీసులను ఆమె ఆదేశించారు. దీనిపై అలహాబాద్ హైకోర్టు విచారణ జరిపిి సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ నుంచి ఆరేండ్లపాటు ఇందిరా గాంధీని డిబార్ చేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సహించలేని ఆమె దేశంలో అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) ప్రకటించారు.
అయితే ఇలా ప్రభుత్వ సమాచారాన్ని అడగడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలుసుకున్న ఉన్నతా ధికారులు గ్రోవర్ పంపిన ఈమెయిల్ను తీసేయాలని కింది స్థాయి అధికారులకు సూచించడం విశేషమని హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది. ఈమెయిల్కు సంబంధించి మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధిని ప్రశ్నించగా 'ఈమెయిల్లో అతను కోరిన సమాచారంపై స్పష్టత లేదని, దాన్ని మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండిస్టీ, ఇంటర్నల్ ట్రేడ్' కార్యదర్శికి పంపినట్టు చెప్పారు. గెజిటెడ్ అధికారులు, న్యాయమూ ర్తులు, సైనిక దళాలు, పోలీసు శాఖ, ఎక్సైజ్, రెవెన్యూ, ఇతర శాఖలకు చెందిన అధికారుల నుంచి ప్రభుత్వ పరమైన సహాయాన్ని కోరడం సెక్షన్ 124(7) కింద అవినీతి ప్రవర్తన కిందకు వస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.