Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీల మ్యానిఫెస్టోల్లోనూ కనిపించని అంశం
- ఆధునిక ప్రజాస్వామిక దేశాల్లో సానుకూల అడుగులు
- సంస్కరిస్తే ఖజానాకు మిగులు : నిపుణులు
న్యూఢిల్లీ : దేశంలో జైళ్ల పరిస్థితి దిగజారిపో తున్నది. కారాగారాల్లోని ఖైదీలు, నిందితుల జీవన ప్రమాణాలు అడుగంటిపోతున్నాయి. ఇటీవలే విడుదల చేసిన నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో నివేదికనే ఇందుకు ఉదాహరణ. దేశంలోని మొత్తం (సుమారు 1400) జైళ్లలో మగ్గుతున్నవారిలో 67శాతం మంది విచారణ ఖైదీలేనని ఆ నివేదిక వెల్లడించింది. నేరస్తులు తమ తప్పుకు ప్రాయశ్చిత్తపడి, తమ ప్రవర్తనను మార్చుకుని సక్రమంగా వ్యవహరించేందుకు దోహదపడేలా ఉండాల్సిన జైళ్లు.. కొన్ని సందర్భాల్లో వారిలో మరింత నేరప్రవృత్తిని పెంచే అవకాశాన్నిస్తు న్నాయి. ఒక్కసారి జైలు నుంచి విడుదలయ్యాక ఇంకో నేరంలో మరోసారి జైలుకు వెళ్లేవారి సంఖ్యా తగ్గడం లేదు. సమాజంలో నేరాలను నియం త్రించే ప్రక్రియలో భాగమైన జైళ్లపై మాత్రం రాజకీయ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోల్లోనూ జైళ్ల సంస్కరణల అంశం మచ్చుకైనా కనిపించలేదు. కానీ, ఆధునిక ప్రజాస్వామిక దేశాల్లోని పార్టీలు.. జైళ్ల సంస్కరణలపై సానుకూలంగా ఉన్నాయి.
ఆ దేశాల్లో జైళ్ల సంస్కరణలవైపు అడుగులు
జైళ్లను.. నేరస్తులు తమను తాము సంస్కరించుకునే వేదికగా, రిహబిలిటేషన్ క్యాంపులుగా, నేర్చుకోవడం, పనిచేయడంలాంటి అవకాశాలతోపాటు, జైళ్లలో ప్రతి వ్యక్తి(ఖైదీ) యథాస్థితికి వచ్చేందుకు ఉపకరించే ప్రణాళికలు వేయాలని ఆధునిక ప్రజాస్వామిక దేశాల్లో ప్రతిపాదనలు వస్తున్నాయి. యూకేలో ప్రధాన పార్టీలైన కన్జర్వేటివ్స్, లేబర్, లిబరల్ డెమోక్రాట్ పార్టీలు 2017 జనరల్ ఎన్నికల్లో ఇలాంటి ప్రతిపాదనలు చేశాయి. యూఎస్లోనూ ఈ తరహా ప్రతిపాదనలు వచ్చాయి. 2016లో అధ్యక్ష ఎన్నికల్లో.. నాన్ వాయిలెంట్ కేసుల్లోని ఖైదీలకు శిక్షలను కొద్దిమేరకు సడలించాలని రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీలు ప్రతిపాదించాయి. జైళ్లలో ఖైదీల సంఖ్యను తగ్గించాలని, పునరావృతయ్యే ఖైదీలను తగ్గించాలనే ప్రధాన డిమాండ్ అమెరికా మధ్యంతర ఎన్నికల్లో వినిపించింది. కానీ, సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న మన దేశంలో బీజేపీగానీ, కాంగ్రెస్గానీ ఈ అంశాన్ని అసలు ప్రస్తావించనేలేవు.
ప్రభుత్వానికే కలిసొస్తుంది..
ఎన్నికల్లో జైళ్ల సంస్కరణ అంశాలు మ్యానిఫెస్టోల్లోకి రాకపోవడం, చర్చల్లో లేకపోవడా నికి అది కాస్త ఖరీదైన వ్యవహారంగా వారికి తోచడమే కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. జైళ్లలో రిహాబిలిటేషన్(ఖైదీలను యథాస్థితికి తీసుకురావడం, సత్ప్రవర్తన కలగజేయడం) కార్యక్రమాలు ఖరీదైనవే కావచ్చు గానీ, దీర్ఘకాలంలో అవి ప్రభుత్వ ఖజానాకు కలిసొస్తాయని క్రిమినాలిజస్టులు విశ్లేషిస్తున్నారు. ఈ కార్యక్రమాలతో విడుదలైన ఖైదీలు మళ్లీ నేరాలకు పాల్పడటం తగ్గిపోతుందని, పున రావృతమయ్యేవారు తగ్గిపోతారని చెబుతున్నారు. వారికి నైపుణ్య శిక్షణ, ఉద్యోగాలకు యోగ్యులను చేయడం ద్వారా నేరాల శాతం తగ్గుముఖం పడుతాయని వివరిస్తున్నారు. దీంతో జైళ్లల్లో ఖైదీల సంఖ్య తగ్గితే వారి నిర్వహణ చౌకగా మారు తుందని, అలాగే జైళ్లలోనూ నేరాలను సమ ర్థవంతంగా నియంత్రించవచ్చని వివరించారు. తీవ్ర నేరప్రవృత్తిగల వారిని ప్రత్యేకంగా ఉంచవచ్చని, దీంతో చిన్న నేరాల్లోని ఖైదీలకు పెద్ద నేరస్తులతో సంబంధం ఏర్పడదని చెప్పారు.
నిర్లక్ష్యానికి కారణాలేమిటీ?
రిహాబిలిటేషన్ కార్యక్రమాలు ఖరీదైన వ్యవహారం కావడంతోపాటు తీరా ఆ కార్య క్రమాలతోనూ నేరస్తులు తగ్గకపోతే విమర్శలను ఎదుర్కోవలసి వస్తుందని అధికార పార్టీలు ఆలోచిస్తాయి. అలాగే పార్టీల మ్యానిఫెస్టోలూ అధ్యయనాలపై కాకుండా సాధారణంగా పార్టీ నేతల వ్యక్తిగత అభిప్రాయాలు, వారు సేకరించిన అభిప్రాయాల ఆధారంగా రూపొందిస్తారు. పరిశోధనలకు, అధ్యయనాలకు సాధారణంగా కాంగ్రెస్, బీజేపీలాంటి పార్టీలు ప్రోత్సహించబో వని, ఈ అధ్యయనాలు చేపడితే.. ఆ పార్టీల నేతల అభిప్రాయాలకు విరుద్ధమైన అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుందేమోననీ భవి స్తుండవచ్చని క్రిమినాలజిస్టులు చెప్పారు. దీనికి ఉదాహరణగా బీబీసీ డాక్యుమెంటరీ ఇండియాస్ డాటర్ను ప్రస్తావించారు. అప్పుడ పరిశోధకులను జైళ్లలోకి అనుమతించకుండా అడ్డుకున్నదనే విషయాన్ని గుర్తుచేశారు. అలాగే నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నట్టు ప్రజలు భావించేలా ఆ పార్టీలు వ్యవహరించాలనుకుంటున్నాయి. అలా గైతేనే అధికారాన్ని కాపాడుకోగలమని భావి స్తుంటాయని విశ్లేషణలు వచ్చాయి.