Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాప్ 11 హిందీ న్యూస్ ఛానెళ్ల తీరు
- రాహుల్, ప్రియాంకల కంటే.. మోడీ-షా ప్రచారాలకు రెండున్నర రెట్లు
అధిక ప్రసారాలు
న్యూఢిల్లీ : రాజకీయ నాయకులను ప్రశ్నించి ప్రజాపక్షం వైపు నిలబడాల్సిన కొన్ని ఛానెళ్లు వారికి భక్తులుగా మారుతున్నాయి. రాజకీయ ఒత్తిడో, టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవడమో, లేక మరేదైనా లాభాపేక్షనో కారణం తెలీదు కానీ కొన్ని ఛానెళ్లు మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో దేశంలోని టాప్-11 హిందీ న్యూస్ ఛానెళ్లు ఇతర పార్టీల ప్రచారాలు, సమావేశాల కంటే బీజేపీ ప్రచార కార్యక్రమాలనే అధికంగా ప్రచారం చేశాయి. మరీ ముఖ్యంగా మోడీ, అమిత్షాల ఎన్నికల ప్రచారాలు, సమావేశాలను ఈ ఛానెళ్లు దాదాపు 850 గంటల పాటు ప్రసారం చేశాయి. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) నుంచి సమాచారాన్ని సేకరించిన ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ దీనిపై ఒక నివేదికను ప్రచురించింది. కేవలం ఒక నెలలోనే(ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 28 మధ్య)722 గంటల 25 నిమిషాల 45 సెకండ్ల పాటు మోడీ ప్రచార కార్యక్రమాలను ప్రసారం చేశాయి. అలాగే అమిత్ షా కోసం 123 గంటల 35 నిమిషాలను కేటాయించాయి. అయితే మోడీ, షాలతో పోల్చుకుంటే కాంగ్రెస్ నాయకులు రాహుల్, ప్రియాంక ల ప్రచారకార్యక్రమాల ప్రసారానికి ఆ 11 చానెళ్లు తక్కువ సమయాన్నే(ఇద్దరికి కలిపి కేవలం 335 గంటలు) వెచ్చించాయి. ఇందులో రాహుల్ను టీవీలో చూపించడానికి 251 గంటల 36 నిమిషాలు, ప్రియాంక కోసం కేవలం 84 గంటల 24 నిమిషాల వరకు మాత్రమే పరిమితం చేయడం గమనార్హం. గతనెల 25న వారణాసిలో మోడీ నామినేషన్ సమర్పించే ముందు నిర్వహించిన రోడ్షో కార్యక్రమాన్ని వార్తా ఛానెళ్లు దాదాపు మూడు గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం నిర్వహించాయి. అయితే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా విలేకరలకు రాహుల్ ఇచ్చిన ఇంటర్వూలను మాత్రం కేవలం 25 నిమిషాలకు కుదించడం గమనార్హం. ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షరు కుమార్ ఇటీవల మోడీతో నిర్వహించన ఇంటర్వ్యూను సైతం పలు ఛానెళ్లు టీవీల్లో ప్రసారం చేయడం గమనార్హం. అయితే దేశంలో ఎన్నికల సమయంలో అభివృద్ధిపై చర్చను పక్కదోవ పట్టిస్తూ, దొరికిన ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని న్యూస్ ఛానెళ్లలో అధికంగా కనిపించి ఓటర్లను ప్రభావితం చేయడం బీజేపీకి అలవాటేనని కొందరు విమర్శకులు గుర్తుచేస్తున్నారు.