Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాంబే హైకోర్టులో పిల్ దాఖలు
- ఇప్పటికే ఈవీఎంలపై అనుమానాలు లేవనెత్తుతున్న ప్రతిపక్షాలు
ముంబయి: తయారీదారులు కేంద్ర ఎన్నికల కమిషన్కు అందచేసిన దాదాపు 20 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) ఇప్పుడు 'తప్పిపోయాయన్న' అభియోగంతో బాంబే హైకోర్టులో బుధవారం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంలో తన ఆరోపణలకు ఆధారంగా స.హ చట్టం కింద ఎన్నికల కమిషన్ నుంచి అందిన సమాధానాన్ని పిటిషనర్ జత చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల విశ్వసనీయత, లోపాలపై సర్వత్రా చర్చ జరుగుతున్న సమయంలో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కోర్టు ముందుకు రావటం గమనార్హం. ఈవీఎంలు లోపభూయిష్టంగా వున్నందున వీటికి అనుబంధంగా ప్రవేశపెట్టిన ఓటు రసీదు యంత్రా (వీవీపాట్)లలో నమోదయిన ఓట్లను ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 50 శాతం మేర లెక్కించాలంటూ 21 ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు లేవనెత్తిన ఈ సమస్యలపై ఎన్నికల కమిషన్ స్పందించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని రాజకీయ పరిశీలకులు, ప్రతిపక్ష పార్టీ నేతలు, రిటైర్డ్ సివిల్ అధికారులు చెబుతున్నారు. వీవీపాట్ల ఓట్లను 50 శాతం మేర లెక్కించాలన్న డిమాండ్ను నిరాకరిస్తున్న ఈసీ వైఖరిపై ఈ వర్గాలన్నీ విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. తాము సంధించిన ప్రశ్నలకు ఈసీ స్పందించిన తీరు ఏకపక్షంగానూ, వింతగానూ వుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వంటి ప్రతిపక్ష నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల కమిషన్ తీరును తప్పుపడుతూ పలువురు మాజీ సివిల్ సర్వీసుల అధికారులు రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. వీవీపాట్లలోని ఓట్లను లెక్కించేందుకు ఈసీ నిరాకరిస్తుండటం ఈవీఎంలు లోపభూయిష్టంగా వున్నాయని అంగీకరించటమేనని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ వ్యవస్థ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బతింటోందని గతంలో ప్రధాన ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన టిఎన్ శేషన్, ఎంఎస్ గిల్ వంటి వారితో కలిసి పనిచేసిన ఒక సీనియర్ అధికారి అభిప్రాయపడినట్టు ఆర్టీఐ సమాధానం ద్వారా తెలుస్తోంది. ముంబయికి చెందిన స.హ కార్యకర్త మనోరంజన్రారు గత ఏడాది మార్చి 27న దాఖలు చేసిన ఈ పిటిషన్లో ఈవీఎంలు, వీవీపాట్ల కొనుగోలు, నిల్వ, వినియోగం వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లను నిలదీశారు. ఇందుకు సంబంధించిన ఆర్డర్ల వివరాలను వెల్లడి చేయాల్సిందిగా మహారాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్, కేంద్ర హోం మంత్రిత్వశాఖతో పాటు ఈవీఎంలను తయారు చేస్తున్న రెండు ప్రభుత్వ రంగ సంస్థలు ఈసీఐఎల్, బెల్ను ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. స.హ చట్టం ద్వారా లభించిన సమాచారం ఆధారంగానే ఈ పిల్ దాఖలు కావటం గమనార్హం. కొనుగోలు, పంపిణీ, నిల్వ, వినియోగం వంటి అంశాలలో చోటుచేసుకున్న లోపాలను స.హ చట్టం ద్వారా లభించిన పత్రాలు ఎత్తి చూపాయి. ఇందులో జరిగిన అక్రమాల కారణంగా దాదాపు 116.55 కోట్ల రూపాయల మేర వృధా అయినట్టు ఈ పత్రాలు అంచనా వేశాయి. ఉత్పత్తి సంస్థల నుండి ఎన్నికల కమిషన్కు అందిన ఇవిఎంలకు, తయారీ సంస్థల రికార్డులకు తేడా వుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఉత్పత్తి సంస్థలు ఎన్నికల కమిషన్కు అందచేసిన దాదాపు 20 లక్షల ఇవిఎంల జాడ తెలియటం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిల్పై గత ఏడాది కాలంగా దాదాపు ఏడు విచారణలు కొనసాగినప్పటికీ ఇప్పటి వరకూ కేంద్ర ఎన్నికల కమిషన్కానీ, రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు కానీ స్పందించలేదని తెలుస్తోంది. సీఈసీ, రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు ఇండెంట్ పెట్టిన దానికన్నా అదనంగా కొన్ని ఇవిఎంలను ఈ సంస్థలు సరఫరా చేసినట్లు స.హ చట్ట సమాధానం ద్వారా తెలుస్తోంది.
ఎక్కడికెళ్లాయి
ఈసీ అడిగిన వాటికన్నా అదనంగా అందచేసిన ఈవీఎంలు ఎక్కడికెళ్లాయన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు సంబంధించి ఉత్పత్తి సంస్థలకు అందిన అదనపు సొమ్ము వెనుక రహస్యం ఏమిటన్నది సమాధానం దొరకని మరో ప్రశ్నగా మిగిలిపోతోంది. వాస్తవానికి అటు కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద కానీ, రాష్ట్రాల ఎన్నికల కమిషన్ వద్ద కానీ ఈవీఎంలు, వీవీపాట్ల కొనుగోలు, నిల్వ, వినియోగం, పనితీరు బాగాలేని ఇవిఎంలను ధ్వంసం చేయటం వంటి అంశాలకు సంబంధించి నిర్దిష్ట విధానాలేవీ లేవని స.హ కార్యకర్త రారు చెబుతున్నారు. సరైన రికార్డులు, సీరియల్ నంబర్లు లేని ఇవిఎంలను ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి తరలించే విషయంపై కూడా పిల్ వేసిన రారు అనేక సందేహాలు లేవనెత్తారు. కొనుగోలు, తరలింపు, వినియోగం వంటి అంశాలలో నిర్దేశిత విధానాలు లేకపోవటం, ఈ యంత్రాల దుర్వినియోగానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్ విచారణపై ఈసీ స్పందిస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన పిటిషనర్ రారు దీనిపై కేసు సత్వర విచారణకు ముంబయి హైకోర్టుకు ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఇప్పటి వరకూ ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించలేదు.