Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిలికా పేరుతో అనుమతి
- చిలుక ఇసుక తవ్వి ఎగుమతులు
- ప్రజాప్రతినిధులే రక్ష
- పట్టని పోలీస్, మైనింగ్ అధికారులు
- అధికార్లపై దాడిచేస్తే చర్యలే లేవు
ఒంగోలు : రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అనేక జిల్లాల్లో పోలింగ్కు ముందూ, తర్వాతా ఇసుక మాఫియా యథేచ్చగా తవ్వకాలు జరుపుతూ ప్రజా సంపదను దోచుకుంటున్నారు. ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో అసైన్డు, అటవీ, ఇతర ప్రభుత్వ భూములుంటాయి. కోట్లు సంపాదించి పెట్టే ఇసుక గనులున్నాయి. సిలికా ఇసుక పేరుతో ప్రభుత్వం నుండి అనుమతులు పొందారు. అయితే సిలికా ఇసుక మాత్రం ఒక్క ట్రక్కూ బయటకు రాదు. అంతా చిలుక ఇసుకే తవ్వకం చేసి ఇతర రాష్ట్రాలకూ ఎగుమతులు చేస్తారు. కోట్లు సంపాదించారు. వీరంతా ప్రజాప్రతినిధుల కుటుంబాలకు చెందినవారు కావడంతో మైనింగ్, పోలీసు, రెవెన్యూ అధికారులెవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో అధికారులు కొన్ని సందర్బాల్లో దాడులు చేసినా రాజకీయ సిఫార్సులతో అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. చివరికి అధికారులు వేసిన పెనాల్టీలు కూడా చెల్లించకుండా కోర్టులకు వెళ్లి కాలం గడుపుతున్నారు. లారీ ఇసుక హైదరాబాదుకు పంపి రూ.50 నుండి 60 వేలు సంపాదిస్తున్నారు. రోజుకు 100 నుంచీ 150 లారీలు ఇతర ప్రాంతాలకు వెళుతున్నాయి. ఎటువంటి రాయల్టీలూ చెల్లించరు. వాహనాలకు జియోట్యాగ్ ఉండదు. బిల్లులూ ఉండవు. యధేచ్చగా నిబంధనలన్నీ గాలికొదిలేశారు. క్వారీల్లోకి మీడియా ప్రతినిధులు వెళ్లినా తిరిగి బయటకు వస్తారా?లేదా అనే పరిస్థితి నెలకొంది.
సిలికా అనుమతులు.. చిలుక ఇసుక తవ్వకాలు..
ఇక్కడ సిలికా ఇసుక గనులు పెద్దగా లేవు. వీటి అవసరం స్థానికంగా లేదు. పైగా సిలికా ఇసుకను కంప్యూటర్లలో వినియోగించే హార్డ్వేర్ పరికరాలకు వాడతారు. చిప్లలో దీన్నే వినియోగిస్తారు. దీన్ని తీసుకునే కంపెనీలు కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. సిలికా ఇసుక పేరుకే. ఆ పేరుతో చిలుక ఇసుకగా చెప్పబడే తెల్లటి ఇసుకను తవ్వి ఎగుమతులు చేస్తున్నారు. సిలికా ఇసుక కోసం సుమారు 14 మంది క్వారీ యజమానులు ప్రభుత్వానికి 1996లో దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొందరు క్వారీయింగ్ చేస్తున్నారు. కొందరు మానేశారు. చీరాల ప్రాంతంలో గడిచిన పదేళ్లలో స్థానిక ప్రజా ప్రతినిధి కుటుంబం ఇసుక క్వారీలపై ఆధిపత్యం పెరిగింది. ఇతరులెవ్వరూ అక్కడ క్వారీయింగ్ చేయడానికీ ముందుకు రావడంలేదు. పదేళ్లుగా ఇదే తంతు సాగుతోంది. దీనిపై నోరు మెదిపే నేతలు గానీ, స్థానికులు గానీ లేరు. ఎందుకంటే దీనిపై మాట్లాడితే ప్రాణాలతో ఉంటామా?లేదా అన్న భయం అటవీ భూముల్లో విచ్చలవిడిగా తవ్వకాలు..
ఈ ప్రాంతంలో మడ అడవుల భూముల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అనుమతులు తీసుకున్న భూములకు చుట్టూ ఉన్న అటవీ భూములు, అసైన్డ్, ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేశారు. ఈ ప్రాంతాన్ని చూస్తే ఓబులాపురం మైనింగ్ గుర్తుకొస్తోంది. 1.5 కిలోమీటర్ల పొడవున, 500 మీటర్ల వెడల్పున సుమారు 50 మీటర్ల లోతులో ఇసుక తవ్వకాలు జరిగాయి. కొన్ని చోట్ల భూగర్జజలాలూ బయటపడ్డాయి. అంటే ఎంత లోతున తవ్వారో విధితమవుతోంది. అటవీశాఖ పెంచిన మొక్కలనూ తవ్వేశారు. క్వారీయింగ్కు ఏది అడొచ్చినా... వాటిని తవ్వేస్తారు. తవ్విన ఇసుకను కూడా అటవీ భూముల్లో నుంచే రోడ్డు వేసుకుని బయటకు తెచ్చుకుంటున్నారు. వాహనాల సంఖ్య లెక్కించేందుకు ఓ టోల్ గేటు కూడా పెట్టుకున్నారంటే ఎంత బరితెగించారో తెలుస్తోంది.
గతంలో ఈ ప్రాంతంలో కొందరు పేదలకు ఈ భూములను అసైన్డు చేశారు. ఇపుడు వీరి భూములు కూడా తవ్వేశారు. పేదలకు ఎంతో కొంత చేతిలో పెట్టి భూములను లాగేసుకున్నారు. వీరెవరైనా నోరుతెరిస్తే వెంటనే దాడులు చేస్తారు. దీంతో పేదలెవ్వరూ ముందుకు రాలేకపోతున్నారు. పందిళ్లపల్లి హైస్కూలుకు చెందిన భూములనూ తవ్వేశారు. సుమారు ఎకరంన్నర భూమిని తవ్వారని చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ అక్రమ తవ్వకాలపై మైనింగ్, రెవెన్యూ పోలీసు శాఖల ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సి ఉంది.
శ్రీకాకుళం రూరల్ మండలం నైరలో ఇసుక అక్రమార్కులు రెవెన్యూ సిబ్బందిపై మంగళవారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఇసుక రవాణ జరుగుతుందన్న సమాచారంతో ఆ ప్రాంతానికి నలుగురు విఆర్ఒలు, ఒక విఆర్ఎతో కూడిన ప్రత్యేక బృందం అక్కడకు వెళ్లింది. అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక లారీని రెవెన్యూ సిబ్బంది అడ్డగించగా, దాడి చేసి గాయపరిచారు. ఫొటో తీస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఇసుక అక్రమార్కులు రెచ్చిపోయారు. ఇద్దరు విఆర్ఓలపై కర్రలతో దాడి చేశారు. మరో ఇద్దరు విఆర్ఒలు, విఆర్ఎ అక్కడ్నుంచి తప్పించుకుని పరుగులు తీశారు. రిమ్స్లో చికిత్స పొందుతున్న విఆర్ఒలను జాయింట్ కలెక్టర్ కెవిఎన్ చక్రధరబాబుతో కలిసి బుధవారం పరామర్శించారు. విఆర్ఒల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్న అనంతరం జరిగిన ఘటనను విఆర్ఒలు కలెక్టర్కు వివరించారు. దాడికి పాల్పడిన వారిని వదలబోమని, కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని గొరిగనూరు వద్ద ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న హెడ్కానిస్టేబుల్ రామాజంనేయులును ట్రాక్టర్తో ఢ కొట్టారు. ఈ ఘటనలో ఆయన చేయి విరిగింది. పోలీసులు ఆరు ట్రాక్టర్లను సీజ్ చేశారు. హెడ్కానిస్టేబుల్పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు.