Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశరాజధానిలోని ఎయిమ్స్లో కులవివక్ష - అంబేద్కర్ అనే ఆంశంపై చర్చ నిర్వహించేందుకు కళాశాల యాజమాన్యం ఆంక్షలతో కూడిన అనుమతులను జారీ చేసింది. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎయిమ్స్లో ''సామాజిక సంబంధాలపై అంబేద్కర్ దృక్పథం : ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష '' అనే అంశంపై 'ఫ్రంట్ ఫర్ సోషల్ కాన్సియస్నెస్' అనే విద్యార్థి సంస్థ చర్చాగోష్టిని క్యాంపస్లోని నిర్వహించాలనుకుంది. దీని కోసం కళాశాలలోని మీటింగ్ హాల్ కావాలని యాజమాన్యాన్ని అనుమతి కోరింది. దీనిపై ఎయిమ్స్ డైరెక్టర్ల బోర్డు స్పందిస్తూ ఇది రాజకీయ కార్యక్రమమంటూ అనుమతులను నిరాకరించింది. ఇది వైద్యావిద్యకు ఏవిధంగానూ ఉపయోగకరం కాదని నిరాకరించింది. కళాశాల ప్రాంగణంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడానికి వీల్లేదని యాజమాన్యం ఏకపక్షంగా అనుమతులను వ్యతిరేకించింది. యాజమాన్య నిర్ణయాన్ని విద్యార్థి నాయకులు, కొందరు డాక్టర్లు వ్యతిరేకించారు. ఈ నిర్ణయం విద్యార్థుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘనేనని మండిపడ్డారు. దీంతో ఈ అంశంపై మరోసారి కళాశాల డైరెక్టర్ల బోర్డు సమావేశమై షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. విద్యార్థులు నిర్వహించే సమావేశంలో ఏ రాజకీయపార్టీ నాయకులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ పాల్గొనకూడదని, ఎలాంటి రాజకీయపరమైన విషయాలను చర్చించకూడదని, అలాగే మీడియాను అనుమతించరాదని సూచించింది. యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు వారి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఇలాంటి ఆంక్షలు చట్టవిరుద్ధమన్నారు.