Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూ గర్భిణిని తన ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్ళిన ముస్లిం యువకుడు
- అసోంలో వెల్లివిరిసిన మతసామరస్యం
గువహతి : అసోంలో మతసామరస్యం వెల్లివిరిసింది. కర్ఫ్యూ ఆజ్ఞలను ధిక్కరిస్తూ ఓ ముస్లిం వ్యక్తి నిండు గర్భిణి అయిన హిందూ మహిళను తన ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్ళడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మత ఘర్షణల కారణంగా అసోంలోని హైలకండీలో కర్ఫ్యూ విధించారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఓ హిందూ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతున్నది. విషయం తెలుసుకున్న పొరిగింటి ముస్లిం యువకుడు.. కర్ఫ్యూను కూడా లెక్క చేయకుండా తన ఆటోలో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఒక్కపక్క అల్లాను కొలుస్తూ.. మరోపక్క తాను నడిపించగలిగినంత వేగంగా ఆటోను నుడుపుతూ.. ఆ మహిళను క్షేమంగా.. తగిన సమయానికి ఆస్పత్రికి చేర్చాడు. దాంతో గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారు. అసోంలో మత ఉద్రిక్తతలు చోటుచేసుకున్న హైలకండిలో ఇటీవల నిషేధాజ్ఞలను విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు మొహనీశ్ మిశ్రా, హైలకండి డిప్యుటీ కమిషనర్ కీర్తి జల్లి ఇతర అధికారులు బాబు తల్లిదండ్రులు నందిత, రూబన్ దాస్లను పరామర్శించారు.
'హిందూ ముస్లింల ఐక్యత, సోదరబావానికి చిహ్నంగా నిలిచిన ఇలాంటి ఘటనలు మరెన్నో వెలుగులోకి రావాలి' అని పోలీసు అధికారులు చెప్పారు. సరైన సమయంలో తగిన సహాయం అందించిన రూబన్ దాస్ పొరిగింటివాసి మక్బూల్ను కూడా వారు కలిశారు. కర్ఫ్యూ ఉన్న సమయంలోనూ సాహసోపేతంగా ఆమెను ఆస్పత్రికి చేర్చిన ఆటోడ్రైవర్ను ప్రత్యేకంగా కలిసి ప్రశంసించారు. హైలకండిలో ఇటీవల చెలరేగిన మతఘర్షణల్లో ఒక వ్యక్తి మృతిచెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 15 వాహనాలు ధ్వంసమయ్యాయి.