Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహిర్గతం చేయలేం : ఆర్థికశాఖ
న్యూఢిల్లీ:నల్లధనంపై స్విట్జర్లాండ్ నుంచి పొందిన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోలేమని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. వ్యక్తులు, సంస్థలు తమ దేశంలో దాచుకున్న నల్లధనం గురించి స్విట్జర్లాండ్ ఇచ్చిన వివరాల ఆధారంగా చేపట్టిన చర్యలేమిటని సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం కింద పీటీఐ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చేందుకు ఆర్థికశాఖ నిరాకరించింది. నల్లధనంపై పరస్పరం సమాచారాన్ని పంచుకోవడంపై స్విట్జర్లాండ్తో 2016, నవంబర్ 22న జరిగిన ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఆ వివరాల్ని వెల్లడించలేమని ఆర్థికశాఖ తెలిపింది. స్విట్జర్లాండ్లో భారతీయుల ఖాతాల వివరాలు 2019 తర్వాత అందుబాటులోకి వస్తాయని ఆర్థికశాఖ తెలిపింది. దేశం లోపల, ఇతర దేశాలలో మన దేశీయుల నల్లధనం ఎంత ఉన్నదనేదానిపై అంచనాలు ఇంకా తేలలేదని ఆర్థికశాఖ తెలిపింది.
ఫ్రాన్స్తో ద్వంద్వ పన్నులను నిరోధించే ఒప్పందం ఉన్నట్టు ఆర్థికశాఖ తెలిపింది. ఫ్రాన్స్లోని హెచ్ఎస్బీసీ బ్యాంక్ ఖాతాల్లో 427 కేసుల మదింపు పూర్తయిందని, వీటిలో 162 కేసుల్లో ఆదాయ వివరాలు వెల్లడించనందుకు రూ.1291 కోట్ల జరిమానా విధించినట్టు ఆర్థికశాఖ తెలిపింది.