Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబ కలహాలే కారణం
నవతెలంగాణ-ముప్కాల్
రాజస్థాన్ నుంచి బతుకుదెరువు నిమిత్తం నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రానికి వచ్చిన వ్యాపారి కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా శనివారం అర్ధరాత్రి సమయంలో కొడుకును చంపి, పక్కనే ఉన్న చెట్టుకు తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ రాజ్భరత్ తెలిపిన వివరాల ప్రకారం.. 15ఏండ్ల క్రితం రాజస్థాన్ రాష్ట్రం నుంచి ముగ్గురు అన్నదమ్ములు వారి కుటుంబాలతో బతుకుదెరువు కోసం ముప్కాల్ మండల కేంద్రానికి వచ్చారు. ఇక్కడే స్థిరపడి రాజస్థాన్ స్వీట్ హోం పేరిట హోటల్ నడుపుతున్నారు. ఇటీవల ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆర్థిక పరమైన మనస్పర్థాలు రావడంతో అన్నదమ్ముల్లో చివరివాడైనా చౌదరి సుజరం(32) వేరు కాపురం పెట్టాడు. బంధువుల వివాహ నిమిత్తం సుజరం కుటుంబసభ్యులను సంప్రదించకుండా మిగతా వాళ్లు అందరూ రాజస్థాన్ వెళ్లారు. దీంతో సుజరం దంపతుల మధ్య వివాదం తలెత్తింది. సుజరం భార్య మూడు రోజుల క్రితం అతనికి చెప్పకుండా కూతురుని తీసుకుని రాజస్థాన్ వెళ్లింది. అన్నదమ్ములు శనివారం ఉదయం రాజస్థాన్ నుంచి తిరిగివచ్చిన విషయం తెలుసుకున్న సుజరం వారి వద్దకు వెళ్లి వివాహ విషయం తనకు ఎందుకు చెప్పలేదంటూ గొడవకు దిగాడు. అనంతరం అందరూ ఇంట్లో నిద్రపోతున్న సమయంలో హోటల్ వెనుక భాగంలో తన కొడుకు విక్రమ్(6) గొంతు నులిమి చంపాడు. తర్వాత పక్కనే ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఆర్మూర్ ఏసీపీ రాములు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బాల్కొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.