Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాస్తవాలను దాచుతున్న యోగి ప్రభుత్వం
- గణాంకాలు తారుమారు చేసే యత్నం
గోరఖ్పూర్లోని ప్రసిద్ధ బీఆర్డీ ఆస్పత్రిలో ఘోరకలి జరిగి రెండేండ్లు పూర్తయినా.. అక్కడి పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రావడటంలేదు. చిన్నారుల వార్డు ఎప్పుడూ కిక్కిరిసి ఉంటుండగా, తల్లిదండ్రుల రోదనలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. మెదడుకు సంబంధించిన వార్డు వద్ద చంటిపిల్లలను ఎత్తుకొని తల్లిదండ్రులు బయట పడిగాపులు కాస్తూనేఉన్నారు. సరిపడా వెంటిలేటర్లు లేకపోవడంతో వారిని ఆస్పత్రిలో చేర్చుకుంటే..ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో.. వైద్యులు నిరాకరిస్తున్నారు. కాగా, రోజుకు సగటును దాదాపు ముగ్గురు శిశువులకు నూరేండ్లూ నిండిపోతున్నాయి. వారి తల్లిదండ్రుల రోదనతో ఆస్పత్రిలో విషాదచాయలు అలుముకుంటున్నాయి.
లక్నో: గోరఖ్పూర్ ఆస్పత్రిలో మెదడుకు సంబంధించిన వార్డులో బీహార్లోని నర్కటియగంజ్ నుంచి వచ్చిన షమీ అక్తర్ తన చిన్నారిని చేర్చాడు. ఆయన దాదాపు 10 రోజులుగా ఆస్పత్రిలో ఉంటున్నారు. చికిత్స ఉచితమని పేరేగానీ, మందులన్నీ బయటకు కొనుక్కోవాల్సిందేనని ఆయన చెప్పారు. ఉచితంగా మందులు కూడా అందించాలన్నది ఆస్పత్రిలో నిబంధన. ఆస్పత్రిలో ఆ మందులు అందుబాటులో లేవనీ, బయటి నుంచి కొనుక్కురమ్మని వైద్యులు చెబుతున్నారని నిరుపేద షమీ అక్తర్ వాపోయారు. ఈ పది రోజుల్లో మందుల కోసం రూ.10 వేల వరకూ ఖర్చుచేశానని ఆయన వాపోయారు.
మెదడువాపును.. న్యుమోనియాగా..
'మెదడువాపు వ్యాధి కారణంగా పిల్లలు చనిపోతున్నారు. అయితే, న్యుమోనియాతో చనిపోయినట్టు పాలనా యంత్రాంగం చెబుతున్నది' అని తన పేరు గోప్యంగా ఉంచమని కోరుతూ ఆస్పత్రికి చెందిన అధికారి ఒకరు అసలు విషయాన్ని బయటపెట్టారు. రోజుకు ముగ్గురు నుంచి నలుగురు పసికందులు ప్రాణాలు విడుస్తున్నారు. కానీ, ప్రభుత్వం ఆ సంఖ్యను దాచిపెడుతున్నదని చెప్పారు. గణాంకాలను పరిశీలిస్తే.. పూర్వాంచల్లో మెదడువాపు వ్యాధి తగ్గలేదు. గతంలో ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులందరినీ బీఆర్డీ ఆస్పత్రికే తీసుకొచ్చేవారు. కానీ, ఇప్పుడు రోగులు ఇక్కడకు రావటం మానేశారు. ఆయా జిల్లాల్లో చికిత్స పొందుతున్నారు' అన్నారు. ఒత్తిడివలస్లే బీఆర్డీ ఆస్పత్రి వైద్యులు గణాంకాలను బయటపెట్టటంలేదని చెప్పారు.
వాస్తవాలను కప్పిపుచ్చే యత్నం : కఫిల్ఖాన్
'మెదడువాపు వ్యాధిని నిర్మూలించడానికి బదులు... వాస్తవాలను దాచిపెట్టేందుకు దారులను వెతుకుతున్నారు. పసికందులకు చికిత్స అందించేందుకు బదులుగా వారిని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు తిరస్కరిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం గణాంకాలను తారుమారుచేసేందుకు ప్రయత్నిస్తున్నది' అని కఫిల్ఖాన్ అన్నారు. 'మెదడువాపు రోగులను బీఆర్డీకి పంపించవద్దంటూ గోరఖ్పూర్ చుట్టుపక్కల మండలాలాల్లోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు అనధికారికంగా ఆదేశాలు అందాయి. రోగులను లక్నో, వారణాసి ఆస్పత్రులకు ఆయా ఆస్పత్రి వైద్యులు సిఫారసు చేస్తున్నారు. మెదడువాపు వ్యాధి కేసులను తక్కువచేసి చూపించేందుకు ప్రభుత్వం నుంచే ఈ ఆదేశాలు వెళ్ళాయి' అని కఫిల్ఖాన్ ఆరోపించారు. బీఆర్డీ ఆస్పత్రిలో రెండేండ్లనాటి విషాద ఘటన నేపథ్యంలో ఆయనపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చనిపోయిన చిన్నారుల సంఖ్య, అందుకు కారణాలకు సంబంధించి వివరాలు చెప్పాల్సిందిగా బీఆర్డీ ఆస్పత్రి వైద్యులను కోరగా.. వారు దాటవేసే ప్రయత్నం చేశారు. అలాంటి వివరాలేవీ తమ వద్దలేవన్నారు. ఆస్పత్రి ప్రిన్సిపాల్ గణేశ్దీ అదే సమాధానం. మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైరెక్టరేట్కు మాత్రమే తాను గణాంకాలు సమర్పిస్తాననీ, జర్నలిస్టులకు కాదని ఆయన సమాధానం ఇచ్చారు.
2017 బాధిత కుటుంబాలకు అందని న్యాయం.
2017 ఆగస్టు 13 నుంచి కేవలం మూడు రోజుల వ్యవధిలో 60 మంది శిశువులు మృతిచెందిన ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాలకు ఇప్పటివరకూ ఎలాంటి న్యాయం జరగలేదు. ప్రభుత్వ అధికారులు ఆయా కుటుంబాలను పరామర్శించటంగానీ, వారికి నష్టపరిహారం చెల్లించటంకానీ జరగలేదు. ప్రభుత్వం నుంచి తమకు నయాపైసా కూడా అందలేదని పిల్లల తల్లిదండ్రులు చెప్పారు. ఆర్టీఐ దరఖాస్తు ప్రకారం 11 నెలల్లో 161 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధితో మరణించారు.