Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరుణాచల్ప్రదేశ్లో రెచ్చిపోయిన తీవ్రవాదులు
ఈటానగర్ : అరుణాచల్ప్రదేశ్కు చెందిన నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) ఎమ్మెల్యే తిరోంగ్ అభోపై జరిగిన ఉగ్రదాడిలో ఆయనతో పాటు మరో 11 మంది దారుణంగా మరణించారు. ఈ ఘటన రాష్ట్రంలోని తిరప్ జిల్లాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే వెళ్తున్న కారుపై తీవ్రవాదులు కాల్పుల వర్షం కురిపించడంతో అభోతో పాటు ఆయన కుటుంబసభ్యులు, భద్రతా సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. అరుణాచల్ప్రదేశ్లోని ఖోన్సా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అభో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బందితో కలిసి ఖోన్సాకు వెళ్తుండగా ఆయన వాహనం బోగపాని గ్రామానికి చేరుకోగానే దానిపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అందులో ఉన్నవారందరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇది నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్ఎస్సీఎన్) పనిగా అనుమానిస్తున్నారు. ఎమ్మెల్యే హత్యను ఎన్ఎస్సీఎన్ అధినేత, మేఘాలయా ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా తీవ్రంగా ఖండించారు. అభో, ఆయన కుటుంబసభ్యుల మరణవార్త తమను షాక్కు గురిచేసిందని అన్నారు. ఈ దాడిలో పాల్గొన్నవారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర హౌంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. కేంద్రమంత్రి కిరణ్ రిజీజు స్పందిస్తూ.. నిందితులపై వీలైనంత త్వరలో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనను అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫెమాఖండూ ఖండించారు.