Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ అధికారంలోకి వచ్చాక మాపై దాడులు పెరిగాయి
- ఉత్తరప్రదేశ్లో గ్రామంలో ముస్లింలు
లక్నో : ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. కాగా, గతేడాది బులంద్షహర్ ప్రాంతంలో హింసాకాండ చెలరేగిన నయాబన్స్ గ్రామంలోని ముస్లింలు టెన్షన్లో ఉన్నారు. గతేడాది డిసెంబరులో ఆ గ్రామంలో చేలరేగిన హింసాకాండ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారితో పాటు మరో పౌరుడు కూడా మరణించాడు. అప్పటి నుంచీ కాదు, రెండేండ్లుగా ఈ గ్రామంలో హిందూ ముస్లింలమధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో నరేంద్రమోడీ గెలిస్తే.. పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ముస్లింలు భావిస్తున్నారు. ఆదివారం వెలువడిన ఎగ్జిట్ ఫలితాల నేపథ్యంలో వారిలో ఆందోళన మరింత పెరిగింది. 'గతంలో గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉండేది. ముస్లింలు, హిందువుల పిల్లలు కలిసి ఆడుకునేవారు. రెండు వర్గాల కుటుంబాలు ఒకరికొకరు తోడూనీడగా ఉండేవారు. అది పెండ్లి వేడుకైనా, చనిపోయినా.. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకునేవారు. ఆనందంగా గడిపేవాళ్లం. బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పు రావడం మొదలైంది. హిందూ - ముస్లింల మధ్య అనుబంధం క్రమంగా తగ్గింది. ఇప్పుడు ఒకే గ్రామంలో నివసిస్తున్నప్పటికీ.. మా మధ్య సంబంధాలు లేవు..' అని గ్రామంలో చిన్న దుకాణం నడుపుకుంటున్న గుల్ఫాం అలీ చెప్పారు. మోడీ అధికారంలోకి వచ్చాక, యూపీని బీజేపీ తన నియంత్రణలోకి తెచ్చుకుంది అన్నారు. 'హిందూ ముస్లింలను విడదీయటమే వారి ప్రధాన ఎజెండా. ఇలాంటి పరిస్థితి గ్రామంలో మేం ఎప్పుడూ చూడలేదు. ఇప్పటికే దాదాపు 12 ముస్లిం కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్ళాయి' అని అలీ చెప్పారు.
ఉద్రిక్తతకు కారణం..
గతేడాది డిసెంబరులో నయాబన్స్ గ్రామంలో హింసాకాండ చెలరేగింది. ముస్లింలు గో వధకు పాల్పడుతున్నారంటూ వచ్చిన పుకార్లతో హిందూ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. గోవధను నియంత్రించటంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. జాతీయ రహదారిపై ఆందోళనకు దిగాయి. పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు, వాహనాలను తగులబెట్టారు. ఆ దాడిలో ఓ పోలీసు అధికారి సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హిందూ ముస్లింల మధ్య దూరాన్ని మరింత పెంచింది. ఆ గాయాలు నయం కాలేదనీ, అప్పటి నుంచి ఆ గ్రామంలో టెన్షన్ వాతావరణమే నెలకొన్నదని వారు వాపోతున్నారు. 'మొత్తం నాలుగు వేల మంది జనాభాలో మేం కేవలం నాలుగు వందల మంది మాత్రమే. అప్పటి నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నాం. ఇప్పుడు మళ్లీ మోడీ గెలిస్తే.. మా పరిస్థితి ఏమిటో అర్థం కావటంలేదు' అని ఓ ముస్లిం మహిళ ఆవేదన వ్యక్తంచేసింది. గత 40 ఏండ్లుగా గ్రామంలో సామరస్య వాతావరణం నెలకొని ఉంటేదని ఆమె చెప్పింది. యోగి ఆదిత్యనాథ్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి టెన్షన్ వాతావరణే ఉందని మరో ముస్లిం మహిళ చెప్పింది. 2017లో రంజాన్ మాసంలో ఇది మొదలైందని అన్నారు. వారి మదర్సాల్లో మైక్లు వాడకాన్ని నిలిపివేయాలని హిందూ కార్యకర్తలు తమపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. మైక్, స్పీకర్ వాడటాన్ని అయిష్టంగానే ముస్లింలు అంగీకరించారని తెలిపారు.
'మా మత ప్రస్తావన కూడా తీసుకురాలేం'
'మా మతం గురించి ఇక్కడ కనీసంగా ప్రస్తావన కూడా మేం తీసుకురాలేం. కానీ, కోరుకున్నది చేసేందుకు వారికి పూర్తి స్వేచ్ఛఉన్నది' అని లా విద్యార్థిని అయిషా (21) అన్నారు. పండుగ ఉత్సవాల సందర్భంగా హిందువులు కొందరు యువకులు ముస్లిం వ్యతిరేక నినాదాలు చేస్తారు. గొడవలు చేస్తారు. వారిపై ఎలాంటి చర్యలూ ఉండవు అని అయిషా చెప్పారు.
'పోలీసు స్టేషన్కు వెళతానని కల్లో కూడా ఊహించలేదు'
గతేడాది జరిగిన గోవు ఘటన నేపథ్యంలో 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని జైల్లో పెట్టారు. ఆ 21 మందిలో షఫ్రుద్దీన్ సైఫీ ఒకరు. 'నేను జైలుకు వెళతానని కల్లో కూడా ఊహించలేదు. న్యాయం కోసం పోరాడాను. నేను జైల్లో ఉన్నంతకాలం నా కుటుంబం చాలా భయపడింది. చేయని తప్పుకు జైలుకు వెళితే.. అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. నేను భయపడటంలేదు. కానీ, కుటుంబం కోసం వేరే ఊరుకు వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా ఎక్కువ మంది ముస్లింలు ఉన్న ప్రాంతానికి. ఇప్పుడు సురక్షితంగా ఉన్నానన్న ధైర్యం వచ్చింది. మరోసారి మోడీ గెలిస్తే.. అక్కడ నివసించే చాలా మందికి కష్ట కాలమే.. ఇది మాత్రం నిజం' అని సైఫీ ఆందోళన వ్యక్తంచేశారు.