Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాచారాన్ని తొక్కిపెట్టడం వల్లే..
-2 సీఎస్వో మాజీ చైర్మెన్ మోహనన్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే సమాచారంపై ప్రపంచ దేశాల్లో నమ్మకం సడలుతోందని కేంద్ర గణాంక కార్యాలయం మాజీ చైర్మెన్ పీసీ మోహనన్ తెలిపారు. నిరుద్యోగంపై రూపొందించిన నివేదిక విడుదలను మోడీ సర్కారు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రాజీనామా చేసిన పీసీ మోహనన్.. సమాచారాన్ని తొక్కిపెట్టడం వల్లే ప్రపంచ దేశాలు కేంద్ర సర్కారు డేటాను విశ్వసించడంలేదని చెప్పారు. దేశంలో నిరుద్యోగం 45 ఏండ్ల గరిష్టానికి చేరిందని పేర్కొన్న రిపోర్టు నేడు అధికారికంగా విడుదలైందని గుర్తు చేశారు. మొదట ఆ సమాచారం పలుపత్రికల్లో ప్రచురితం కావడంపై కేంద్రం స్పందిస్తూ.. అది కేవలం ముసాయిదానే అని, తుది రూపునివ్వలేదని బుకాయిం చిన విషయం తెలిసిందే. ఆ రిపోర్టు గురించి మోహనన్ మాట్లాడుతూ.. చదువుకున్న నిరుద్యోగుల సమస్య గురించి, విద్యకు తయారీరంగం, సేవా రంగంలోని ఉద్యోగాల సృష్టికి మధ్య అంతరం పెరిగిపోతున్నదని ఆందోళన చెందారు. కాగా, ప్రస్తుత ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు విద్యావం తుల్లో కొరవడుతున్నాయని వివరించారు. అయితే 45 ఏండ్ల గరిష్టానికి నిరుద్యోగం పెరిగిందన్న రిపోర్టును ఎన్నికల ముందు విడుదల చేసేందుకు బహుశా సర్కారు వెనుకాడిందేమోనని అన్నారు. కానీ, కమిషన్ ఆమోదించిన ఆ ముసాయిదానే నేడు అధికారికంగా విడుదల చేసిందని చెప్పారు. కాగా, నిరుద్యోగం, జీడీపీలకు సంబంధించిన ప్రభుత్వ సమాచారంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ప్రత్యామ్నాయ సమాచార విధానాలవైపు మొగ్గుతున్నదని తెలిపారు. సర్కారు డేటానైనా వేరే కోణాల్లో విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నదని, తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని తెలిపారు.
అందుకే రాజీనామా :
కమిషన్ సిఫారసులపై కేంద్ర సర్కారు శ్రద్ధ పెట్టలేదని మోహనన్ తెలిపారు. గణాంకాల ఆధారంగా ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలకూ సీఎస్వోను సంప్రదించలేదని చెప్పారు. ప్రధానమైన కార్యక్రమాలు, పథకాలకూ సీఎస్వోను సంప్రదించడం మానుకుందని అన్నారు. అలాగే, నివేదికల విడుదలనూ అడ్డుకోవడం మొదలెట్టిందని, ఈ కారణాల వల్లే తాను కేంద్ర గణాంకాల కార్యాలయ చైర్మెన్ పదవికి రాజీనామా చేశారని పీసీ మోహనన్ తెలిపారు.