Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రమలో కూలీల కంటే వేతన కార్మికులే ఎక్కువ కాలం
- అర్బన్ ఏరియాల్లో వారానికి సగటున 60 గంటలు
- ఎన్ఎస్ఎస్వో నివేదిక
న్యూఢిల్లీ : దేశంలో వేతన కార్మికులు, దినసరి కూలీల పనిగంటలకు సంబంధించి ఎన్ఎస్ఎస్వో తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. బతుకీడ్చేందుకు శ్రామికులు గ్రామాల్లో కంటే పట్టణాల్లో ఎక్కువ పని చేయాల్సి వస్తున్నది. వేతన కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. వారు దినసరి కూలీల కంటే కూడా ఎక్కువ పనిగంటలు ఉద్యోగంలో గడుపుతున్నారు. వారం వ్యవధిలో దినసరి కూలీల కంటే కూడా వేతన ఉద్యోగులే ఎక్కువ గంటలు పనిచేస్తున్నట్టు ఈ రిపోర్టులో వెల్లడైంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2018 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి ఇటీవలే విడుదల చేసిన నివేదికలో గ్రామీణ వేతన కార్మికులు
వారానికి 58 గంటలు పనిచేస్తుండగా.. పట్టణాల్లోని వేతన కార్మికులు వారానికి 60.3 గంటలు పనిచేస్తున్నట్టు వివరించింది. కాగా, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్(ఎన్ఎస్ఎస్వో) ఈ సర్వేను 2017 జులై-సెప్టెంబర్ త్రైమాసికం నుంచి సమాచారాన్ని సేకరించి నివేదిక రూపొందిం చింది. ఈ నివేదికలో గ్రామీణంలో కంటే పట్టణాల్లో ఎక్కువ పని గంటలుండగా.. కూలీల కంటే వేతన కార్మికులు ఎక్కువ కాలం పని చేస్తున్నట్టు వెల్లడైంది. గ్రామీణంలోని పురుష కూలీలు వారానికి సగటున 44 నుంచి 46 గంటలు పని చేస్తుండగా.. పట్టణాల్లో 45 నుంచి 49 గంటలు పని చేస్తున్నారు. అలాగే, గ్రామాల్లో మహిళా కూలీలు వారానికి సగటున 37 నుంచి 39 గంటలు పని చేస్తుండగా.. పట్టణాల్లో 39 నుంచి 42 గంటల శ్రమ చేస్తున్నారు. కాగా, 2018 ఏప్రిల్-జూన్ త్రైమాసిక వివరాల ప్రకారం.. గ్రామాల్లో వేతన కార్మికులు వారానికి సగటున 57.8 గంటలు, పట్టణాల్లో 60.1 గంటలపాటు పని చేస్తున్నారు. ఇదే విభాగంలో మహిళలు గ్రామాల్లోనైతే వారానికి సగటున 49.5 గంటలు, పట్టణాల్లో 52.7 గంటలు పనిచేస్తున్నారు. స్వయం ఉపాధిని నమ్ముకున్న పురుష కార్మికులు గ్రామాల్లో వారానికి సగటున 50.5 గంటలు, పట్టణాల్లో 58.5 గంటలు శ్రమిస్తున్నారు. ఇదే విభాగంలో మహిళా శ్రామికులు గ్రామాల్లో వారానికి సరాసరి 37.4 గంటలు, పట్టణాల్లో 41.5 గంటలు పని చేస్తున్నారు.