Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కథువా లైంగికదాడి కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్లోని కథువా జిల్లాలో ఎనిమిదేండ్ల బాలికపై జరిగిన అమానుష ఘటనకు సంబంధించిన కేసులో ప్రత్యేక కోర్టు ఆరుగురిని దోషులుగా తేల్చింది. వారిలో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, ముగ్గురికి ఐదేండ్ల చొప్పున శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. గతేడాది జనవరి 10న జరిగిన ఈ దారుణ ఘటనలో మొత్తం ఎనిమిది మందిపై హత్య, సామూహిక లైంగికదాడి, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలతో కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. కీలకసూత్రధారి సాంజీరామ్ కుమారుడు విశాల్ జంగోత్రాను కోర్టు నిర్దోషిగా విడుదలచేసింది. ఈ కేసులో మైనరైన ఎనిమిదో నిందితుడిపై విచారణ జమ్మూ కాశ్మీర్ హైకోర్టులో పెండింగ్లో వుంది. దోషులుగా తేలినవారిలో నలుగురు పోలీసు శాఖకు సంబంధించినవారు కావటం గమనార్హం. మానవత్వం మంటకలిపిన ఈ దారుణ కేసులో పంజాబ్లోని పఠాన్కోట్ స్పెషల్ కోర్టు సోమవారం తుది తీర్పు వెల్లడించింది. ప్రధాన నిందితుడు, గ్రామ పెద్ద సాంజీ రామ్, దీపక్ ఖజూరియా, పర్వేశ్ కుమార్లకు యావజ్జీవ కారాగారా శిక్ష విధంచగా, సురేందర్ వర్మ. ఆనంద్ దత్తా, తిలక్ రాజ్లకు ఐదేండ్లు శిక్షను విధించింది. ఆరుగురు దోషులకూ రూ.50వేల జరిమానా కూడా విధిస్తూ పటాన్కోట్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ న్యాయమూర్తి తేజ్విందర్ సింగ్ తీర్పునిచ్చారు. బాధితురాలికి మత్తుపదార్థాలు ఇచ్చి ఓ దేవాలయంలో బంధించి నిందితులు కిరాతకానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఘటన జరిగిన ఏడాది తర్వాత వెలువడిన తీర్పును బాధితురాలి కుటుంబసభ్యులు స్వాగతించారు. తమకు న్యాయం జరిగిందని అన్నారు.
దోషులు
సాంజీరామ్ (ఆలయపూజారి) : మైనరుపై జరిగిన కిరాత ఘటనలో సాంజీ రామ్ కీలక సూత్రధారి. బాలికపై ఆలయంలో తన మేనల్లుడు లైంగికదాడికి పాల్పడినట్టు తెలిసిన తర్వాత బాలికను హతమార్చాలని నిర్ణయించుకున్నట్టు సాంజీరామ్ దర్యాప్తు అధికారులకు తెలిపాడు. సాంజీరామ్ మేనల్లుడు, జువెనైల్ బాలికపై తొలుత లైంగికదాడికి పాల్పడ్డాడు.
దీపక్ ఖజూరియా (ప్రత్యేక పోలీసు అధికారి): హత్యకుముందు బాలికపై లైంగికదాడికి ప్రయత్నించాడు. చివరకు చిన్నారి మెడను తన మోకాళ్ళ మధ్యలో పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేందుకు కూడా యత్నించినట్టు క్రైంబ్రాంచి తన చార్జిషీటులో పేర్కొన్నారు.
పర్వేశ్ కుమార్ : బాలికపై లైంగికదాడికి పాల్పడేందుకు మత్తుపదార్థాలను పర్వేశ్ కుమార్ దుకాణం నుంచి కొనుగోలు చేసినట్టు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.
ఆనంద్దత్తా (సబ్ ఇన్స్పెక్టర్) : జమ్మూకాశ్మీర్ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్త్తా ఈ కేసులో తొలుత దర్యాప్తు అధికారి. సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారు.
తిలక్రాజ్ (హెడ్ కానిస్టేబుల్) : ఫోరెన్సిక్ దర్యాప్తునకు పంపేముందు బాధితురాలి దుస్తులను రక్తపు మరకలు లేకుండా ఉతికించినట్టు నిర్ధారణ అయ్యింది. ఇందుకోసం ప్రధాన నిందితుడు సాంజీరామ్ నుంచి ముడుపులు తీసుకున్నాడు.
సురేంద్ర వర్మ (ఎస్పీఓ) : నిందితులకు సహకరించినందుకుగాను సురేంద్రవర్మను కోర్టు నేరస్తుడిగా తేల్చింది. ఇతనికి ఐదేండ్ల శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధించింది.