Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'దురాక్రమణదారులు'గా పేర్కొంటూ ఇండ్లు ఖాళీ చేయాలని హుకుం
- బారక్ లోయను వీడిన 82 కుటుంబాలు
- అసోం సర్కారు ప్రతీకార చర్య..!
గువహతి : ఈశాన్య రాష్ట్రం అసోంలో బీజేపీ ప్రభుత్వం మతతత్వ అజెండాతో ముస్లింల పట్ల అతిదారుణంగా వ్యవహరించింది. 50 ఏండ్ల పాటు తాము(ముస్లింలు) నివాసమున్న అటవీ సమీప గ్రామాన్ని విడిచి వెళ్లాలంటూ వారిపట్ల అనైతికంగా ప్రవర్తించింది. ముస్లింల పర్వదినమైన రంజాన్ రోజూ అని కూడా చూడకుండా వారిని గ్రామం నుంచి వెళ్లాలని హుకుంజారీ చేసింది. ఏండ్ల పాటు అక్కడ నివాసముండి ప్రభుత్వ పథకాలను సైతం పొందిన ముస్లిం కుటుంబాలను 'దురాక్రమణదారులు'గా పేర్కొంటూ.. అధికార, అంగ బలాన్ని ఉపయోగించి వారిని అక్కడ నుంచి ఖాళీచేసేలా వ్యవహరించింది. ఓ వ్యక్తి హత్యకు సంబంధించిన కేసులో సదరు గ్రామానికి చెందిన ముస్లింవ్యక్తులపై ఆరోపణలు రావడం.. బీజేపీ సర్కారుపై ఒక కరుడు గట్టిన హిందూత్వ సంస్థ ఒత్తిడి చేసిన ఫలితమే గ్రామంలో ఈ పరిస్థితికి దారి తీసిందని పలువురు తెలుపుతున్నారు.
బీజేపీ సర్కారు ప్రతీకార చర్యకు అసోం బెంగాలీ జోన్ బారక్ లోయలోని రాజనిఖాల్ గ్రామం కేంద్రమైంది. ఇది ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి పరిమాల్ సుక్లాబైద్యాకు చెందిన సొంత నియోజకవర్గం ధోలై పరిధిలోనిది కావడం గమనార్హం. ఈ గ్రామంలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. దాదాపు 50 ఏండ్లకు పైగా వారు అక్కడ నివాసం ఉంటున్నారు. అంతే కాదు, వారికి ఓటరు ఐడీ, రేషన్కార్డులు, విద్యుత్తు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇలా ప్రతి పథకాన్నీ వారు పొందుతున్నారు. అయితే సర్కారు ప్రయోజనాలను వారు పొందుతూ స్థానికులుగా గుర్తింపు పొందినప్పటికీ.. బీజేపీ సర్కారు మాత్రం వారిపై 'దురాక్రమణదారులు'గా ముద్రవేసింది. వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించే ఎత్తుగడలు వేసింది. అనుకున్నదే తడవుగా.. గ్రామస్థులకు మే21 నోటీసు ఇచ్చింది. జూన్ 7లోగా ఇండ్లను ఖాళీ చేయాలని, లేని పక్షంలో గ్రామంలో ఇండ్ల తొలిగింపు, కూల్చివేత చర్యలకు దిగాల్సి వస్తుందని ముస్లిం కుటుంబాలను స్థానిక యంత్రాంగం హెచ్చరించింది.
ఈనెల 5న ముస్లింల పవిత్ర పండుగ నాడు రాత్రి 10 గంటలకు గ్రామానికి చేరుకున్న ధోలై పోలీస్ స్టేషన్ అధికారి భార్గవ్ బోరబోరా.. తెల్లవారుఝాము వరకు మీరంతా ఇక్కడ ఉండకూడదని, తట్టాబుట్టా సర్దుకుని ఇక్కడ నుంచి వెళ్లాలని గ్రామంలో ఉన్న ముస్లింలకు ఆదేశాజ్ఞలు జారీ చేశారు. దీంతో చేసేదేంలేక ఒకపక్క వర్షం కురుస్తుండగానే తట్టా, బుట్టా సర్దుకొని 82 ముస్లిం కుటుంబాలు(దాదాపు 1000 మంది) బాధాతప్త హృదయంతో తమ కన్నతల్లి లాంటి గ్రామాన్ని వీడి వెళ్లారు. గ్రామంలో తప్ప తమకు వేరే చోట ఇళ్లు లేదని, తాము ఎక్కడికి వెళ్లాలని పలువురు బాధితులు మరీముఖ్యంగా మహిళలు, చిన్నారులు రోదనలు చేశారు. ఈ వార్త సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది. బీజేపీ సర్కారు చర్యపై నెట్టిజన్లతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'గ్రామాన్ని విడిచి వెళ్లాలని పోలీసు అధికారి వచ్చి మాకు చెప్పారు. వారు మమ్మల్ని బెదిరించారు కూడా. బీజేపీ నాయకులు సైతం మాకు హెచ్చరికలు జారీచేశారు. ఎట్టిపరిస్థితుల్లో 7న గ్రామంలో తొలిగింపు, కూల్చివేతలు ఉంటాయని బీజేపీ నాయకుడు, జెడ్పీసీ సభ్యుడు శశాంక పాల్ మమ్మల్ని ఆదేశించాడు' అని గ్రామస్థుడొకరు తెలిపారు. ఈనెల 7న ఉదయం 6 గంటలకు గ్రామంలో తొలగింపు, కూల్చివేతలు చేపట్టిన యంత్రాంగం.. మధ్యా హ్నం మూడు గంటల వరకు ఇండ్లను కూల్చివేసింది.
ఘటన వెనుక హత్యారాజకీయం..!
గతేడాది ఆగస్టు2న సమీప ప్రాంతం పానీ భోరాలో ఒక ఆటో డ్రైవర్ రూపం పాల్ అపహరణకు గురయ్యారు. అయితే అదే నెల 15న రూపం పాల్ మృతదేహాన్ని కరీంగంజ్ జిల్లాలోని నాయ తిల్లాV్ా అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్య కేసులో రాజనిఖాల్ గ్రామానికి చెందిన అక్బర్ అలీ(40), ఆయన భార్యతో పాటు మరో నలుగురిని ధోలై పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సదరు పోలీసు అధికారులను రాష్ట్రప్రభుత్వం బదిలీ చేసి 'మరోకోణం'లో తనపని కానిచ్చింది. మరోపక్క, రూపం పాల్ హత్య మతం రూపం పులుముకున్నది. కరుడుగటిట్టన కాషాయ సంస్థ హిందూ జాగరణ్ మంచ్(హెచ్జేఎం) ఈ విషయంలో తలదూర్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు రాజనిఖాల్ గ్రామానికి చెందిన ముస్లింలు కావడంతో హెచ్జేఎం సహించలేకపోయింది. నిందితులతో పాటు రాజనిఖాల్ గ్రామంపై ప్రతీకారం తీర్చుకునే చర్యలు ఉండాలని ఇందులో భాగంగానే బీజేపీ సర్కారుపై హెచ్జేఎం ఒత్తిడి తీసుకొచ్చిందని సమాచారం. ఇందుకు రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పరిమాల్ సుక్లాబైద్య కూడా పరోక్షంగా సహకరించారని వార్తలు వినబడ్డాయి.