Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 48 డిగ్రీ సెల్సియస్కు ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ : నైరుతి రుతు పవనాల ఆలస్యం కారణంగా దేశవ్యాప్తంగా ఎండలు దడ పుట్టిస్తున్నాయి. మధ్య, ఉత్తర భారతంలో ఎండలు దంచి కొడుతుండటంతో ఉష్ణోగ్రతలు అమాంతం పైకి పెరుగుతున్నాయి. దేశ రాజధాని సోమవారం (మండే) రోజున భగభగ మండింది. ఏకంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావటం గమనార్హం. మునుపెన్నడూ లేని విధంగా జూన్ నెలలో ఢిల్లీలో ఈస్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డవ్వడం ఇదే తొలిసారి అని ప్రయివేటు వాతావరణ సంస్థ స్కైమేట్ తెలిపింది. 2014లో పాలమ్లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇఫ్పటి దాకా ఇదే అత్యధికమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం ఒక్కసారి భానుడి ప్రతాపంతో పాటు వేడిగాలులు అధికంగా వీచాయి. దీంతో దేశ రాజధానిలో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. బయిటకు రావాలంటేనే బెంబేలెత్తిపోయారు. తప్పనిసరి బయిట కు వెళ్లిన జనాల బాధలు వర్ణణాతీతం. మాడు పగిలే ఎండలతో జనం నీరసించిపోయారు. మూగజీవాలు సైతం దాహర్తిని తీర్చుకోవడానికి అల్లాడిపోయాయి. నీరు ఉన్న ప్రదేశాలకు వెళ్లి అక్కడ కాసేపు సేదతీ రాయి. ఈ సీజన్లోనే రికార్డు ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ఢిల్లీలో విశాలమైన రోడ్లపై ఎక్కడ చూసినా ఎండమావులు దర్శనమిచ్చాయి.
కాగా రాజధానిలో ఎండల తీవ్రత మరో రెండ్రోజులూ ఇదే విధంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఢిల్లీతో పాటు దక్షిణ యూపీ, తూర్పు మధ్యప్రదేశ్, హర్యానా, ఛండీగఢ్, సౌరాష్ట్ర, రాజస్థాన్లలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. ఈ వేసవిలో ఉత్తరభారతంలోని పలు ప్రాంతాలలో మునుపెన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలతో పాత రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. పదిహేను రోజుల క్రితం రాజస్థాన్లోని చురులో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకూ పెరిగాయి. ఇటీవల వెల్లడైన ఒక నివేదిక ప్రకారం.. ప్రపంచంలో పదిహేను అత్యంత ఉష్ణోగ్రతలు నమోదయ్యే నగరాలలో పదకొండు భారత్ నుంచే ఉండటం గమనార్హం.