Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నేనూ అర్బన్ నక్సలైట్నే..' అన్న ధీశాలి
- గిరీష్ కర్నాడ్కు దేశ ప్రజలు ఘన నివాళి
- రచయిత, కళాకారుడుగానేగాక గొప్ప మానవతావాది : అభిమానులు, మేధావులు
నాటకం, సినిమా, కళలు...ఇలా మాధ్యమం ఏదైనా కళాకారుడికి సామాజికబాధ్యత ఉందని చేసి చూపినవాడు గిరీష్ కర్నాడ్. మనదేశం వెయ్యేండ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. మతం, కులం అంటూ కొట్టుకుంటున్నారని ఆవేదన చెందేవారు. మతతత్వం దేశానికి ఏమాత్రమూ మంచిది కాదని కుండబద్దలు కొట్టారు. సమాజాన్ని ప్రశ్నించే, చైతన్యపరిచే మేథావులు 'అర్బన్ నక్సలైట్లు' అయితే, నేనూ అర్బన్ నక్స్లైట్నేనని మెడలో ప్లకార్డు వేసుకొని తిరిగిన ధీశాలి. ఈ సమాజానికి కావాల్సిన నిజమైన కళాకారుడు అనిపించుకున్నారు.
బెంగుళూరు : సినీనాటక రంగంపై చెరగని ముద్ర, ప్రముఖ రచయితగా గిరీష్ కర్నాడ్ సాగించిన ప్రయాణం సామాన్యమైంది కాదు. గొప్ప కళాకారుడిగానేగాక ఒక మంచి మానవతావాదిగా ఆయన ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు. గతకొన్నాండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తన పాత్రలు, రచనల ద్వారా సమాజాన్ని ఆలోచింపజేశారు. వయోభారాన్ని, అనారోగ్యాన్ని లెక్కచేయ కుండా పాలకుల అణిచివేత ధోరణులపై చేసిన పోరాటాన్ని దేశంయావత్తూ చూసింది. ముస్లిం మైనార్టీలపై జాతివిద్వేష దాడులు, గౌరీ లంకేష్ హత్య తదితర ఘటనలపై మౌనంగా ఉండలేదు. రచయితగాకన్నా, నటుడిగాకన్నా ఒక మానవ తావాదిగా పాలకుల తీరును ఎండగట్టారు. పలు వేదికలపై తనదైన ముద్ర వేసిన గిరీష్కర్నాడ్ మృతి దేశానికి తీరనిలోటుగా సినీ, రాజకీయ ప్రముఖులు, మేథావులు నివాళి అర్పిస్తున్నారు. కళాకారుడిగా తన ప్రతిభను నాటక, సినీ వేదికలపై గొప్పగా ప్రదర్శించారనీ, అయితే దాంతోనే తృప్తి చెందక సమాజంలో నెలకొన్న అసమానతల్ని, అంటరానితనాన్ని తప్పుబడుతూ జీవితపర్యంతం గొప్పగా నిలబడ్డారని కర్నాడ్ను నేడు దేశం గుర్తుచేసుకుంటోంది. ఇలాంటివాడు నేటి సమాజానికి చాలా అవసరమని ఆయన అభిమానులు, తోటి రచయితలు, మేథావులు నివాళి అర్పిస్తున్నారు. కర్నాడ్ మృతితో కన్నడనాట విషాధఛాయలు అలుముకున్నాయి. మంగళవారం బెంగుళూరులో ఆయన కుటుంబసభ్యులు చాలా నిరాడంబరంగా గిరీష్ కర్నాడ్ అంత్యక్రియలు నిర్వహించారు.
స్వాతంత్య్రం అనంతరం పుట్టిన యోధుడు
భారత్కు స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ప్రజలందరినీ ఆకర్షించిన రంగం 'నాటకం'. మోహన్ రాకేశ్, విజరు టెండుల్కర్, బాదల్ సర్కార్, హబీబ్ తన్వీర్...ఇలాంటివారిమధ్య 1961లో మెరిసన యువగళం 'గిరీశ్ కర్నాడ్'. ఆయన రాసిన మొదటి నాటకం 'యయాతి'. లండన్లో ఉండగా కన్నడభాషలో రాసిన ఈ నాటకానికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. దీంతో ఇంగ్లీష్ నేలకు సెలవు చెప్పి బెంగుళూరులో దిగిపోయాడు. అనంతరం ఆయన రాసిన నాగమండల, తుగ్లక్, టిప్పుసుల్తాన్...నాటక రచనలు దేశవిదేశాల్లో గుర్తింపు అందుకున్నాయి.
నేటి పాలకుల అణచివేత ధోరణులపై నిరసనగళం వ్యక్తం చేసిన ప్రముఖుల్లో ఒకరు గిరీష్ కర్నాడ్. పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య, అర్బన్ నక్సలైట్లు అనే ఆరోపణలతో మేథావుల అరెస్టు, మైనార్టీలపై దాడులు.. మొదలైన ఘటనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరును ఆయన ఎండగట్టారు. ఎక్కడ ఏ చిన్న నిరసన కార్యక్రమం చేసినా హాజరై బాధితులకు అండగా నిలబడ్డారు. 80ఏండ్ల వయస్సులో అనారోగ్యాన్ని సైతం లెక్కచేయలేదు. కళాకారుడిగా, నటుడిగాకన్నా ఒక గొప్ప మానవతావాదిగా దేశ ప్రజలు ఆయన్ని స్మరించుకుంటున్నారు.
సాదాసీదాగా అంత్యక్రియలు
- ఆయన చివరి కోరికను తీర్చిన కుటుంబీకులు
ప్రముఖ నటుడు, రచయిత, డైరెక్టర్, జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ అంత్యక్రియలు చాలా సాదాసీదాగా జరిగాయి. బతికున్న సమయంలో కర్నాడ్ కోరుకున్నటు ్టగానే కుటుంబసభ్యులు ఆయనకు తుదివీడ్కోలు పలికి ఆయన కోరికను తీర్చారు. జీవితకాలంలో ఎంతోసాదాసీ దాగా బతికిన కర్నాడ్ తన అంత్యక్రియలూ కూడా అలాగే జరిగాయి. ఆయన మృతదేహాన్ని బెంగళూరులోని కాల పల్లి ఎలక్ట్రిక్ క్రిమటోరియంకు ఎలాంటి ఆర్భాటం, పోలీసుసెక్యూరిటీ లేకుండా అంబులెన్స్లో ఆయన కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. కుటుంబసభ్యులు, సమీప బంధువులు, కొందరు మిత్రుల సమక్షంలో క్రిమటోరియం లో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. 'కర్నాటక ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను రాష్ట్రప్రభుత్వ లాంఛ నాలతో అధికారికంగా నిర్వహిస్తామని చెప్పింది. కానీ, ఆయన కుటుంబసభ్యులు ఆయన చివరికోరిక మేరకు నడుచుకోవాలని నిర్ణయించుకోవడంతో అందుకు మేమూ అంగీకరించాం' అని అధికారి ఒకరు తెలిపారు. కర్నాడ్ను కడసారి చూడాలని అభిమానులు పెద్దఎత్తును ఆయన ఇంటికి వచ్చారు. కానీ, ఆయన కుటుంబసభ్యులు కర్నాడ్ మృతదేహాన్ని ప్రజాసందర్శనకు బహిరంగంగా ఉంచడా నికి మాత్రం సున్నితంగా తిరస్కరించారు. కేవలం క్రిమ టోరియంలో మాత్రమే నివాళులర్పించాల్సిందిగా వారిని కోరారు. కాగా, కర్నాడ్ మృతికి సంతాప సూచకంగా సోమవారం సెలవుదినంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. బుధవారం వరకూ సంతాపదినాలుగా ప్రకటించింది.
ఈరోజు ఒక గొప్ప వ్యక్తి మనకు దూరమయ్యాడు. గిరీష్ కర్నాడ్ మృతి భారతీయ నాటకరంగానికి తీరని లోటు
- ముక్తిధామ్, కౌమిది..
నాటక రచనలు చేసిన అభిషేక్ మజుందార్
నాటక రచయితగానేగాక రంగస్థలంపై గొప్ప గొప్ప పాత్రలు చేశారు. మహిళలు, అణగారిన వర్గాలపై అణచివేతను చక్కగా చూపారు.
- సుధార్వ దేశ్పాండే, రంగస్థల నటుడు