Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర రైల్వే మంత్రితో చర్చించిన వెంకయ్యనాయుడు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్తో చర్చించారు. బుధవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఆయన నివాసంలో పలువురు కేంద్ర మంత్రులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా శాఖల మంత్రులతో ఉప రాష్ట్రపతి పలు అభివృద్ధి అంశాలపై మంతనాలు జరిపారు. రైల్వే మంత్రి పియూష్ గోయల్తో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులతో పాటు, ఇటీవల కేంద్రం ఆమోదించిన సౌత్ కోస్ట్ (విశాఖ) రైల్వే జోన్ తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. విశాఖ రైల్వే జోన్ ప్రగతిపై ఆరా తీసిన ఉపరాష్ట్రపతి, ఆ దిశలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైల్వేలైను ప్యాసింజర్ సౌకర్యాలపైనా చర్చించారు. నెల్లూరు జిల్లా ప్రజలు రాజధాని అమరావతికి చేరుకునేందుకు వీలుగా ఫిబ్రవరిలో ప్రకటించిన గూడూరు-విజయవాడ ఇంటర్సిటీ ప్రతిపాదనకు రైల్వే బోర్డు ఆమోదం రావలసి ఉందని, వీటి విషయంలో చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని ఉపరాష్ట్రపతి సూచించారు. దీనికి రైల్వే మంత్రి పియుష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. నెల్లూరు-చెన్నై ఎంఈఎంయు రైలు విషయమై ఆరా తీశారు. ఉపరాష్ట్రపతిని కలిసిన వారిలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ థావర్ చంద్ గెహ్లాట్, కేంద్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ, టెక్స్ టైల్స్ శాఖల మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్, కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తదితరులు ఉన్నారు.