Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్
ఛండీగఢ్ : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ఒప్పంద కార్మికులు పంజాబ్లో గురువారం ఆందోళనకు దిగారు. ఏడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని, అలాగే, తమ కాంట్రాక్టునూ పొడిగించాలని వారు డిమాండ్ చేశారు.
పంజాబ్లోని అమృత్సర్లో బీఎస్ఎన్ఎల్ క్యాజువల్, కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 10న ముగిసిన తమ కాంట్రాక్టును సంస్థ పొడిగించలేదని ఒప్పంద కార్మికులు తెలిపారు. అయితే, ఒప్పందం ముగిసే ఒక్క రోజు ముందు(ఈ నెల 9న) మాత్రమే కాంట్రాక్టును పొడిగించడం లేదని సంస్థ కార్మికులకు తెలిపినట్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి జస్కిరణ్ సింగ్ జాజ్ చెప్పారు. ఈ కార్మికులు 20-25 ఏండ్లుగా సంస్థలో పనిచేస్తున్నారని, కాంట్రాక్టు పొడిగింపును రద్దు చేస్తున్నట్టు ముందస్తు కార్మికులను నోటీసులివ్వాల్సి ఉంటుందని అన్నారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తాము.. సంస్థ నిర్ణయంతో రోడ్డుపై పడ్డారని నిరసన చేస్తున్న కార్మికులు తెలిపారు. పెండింగ్ వేతనాలు చెల్లించడంతోపాటు, తమ ఒప్పందాన్ని పొడిగించాలని వారు కోరుతున్నారు.నిధుల కొరత, కేంద్ర సర్కారు నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల బీఎస్ఎన్ఎల్ ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికను రూపొందించుకుంది. అందులో భాగంగానే సంస్థలో సుమారు 30శాతం మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించాలని నిర్ణయించి దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ సర్కిళ్లకు ఆదేశాలు జారీ చేసింది. పలు బీఎస్ఎన్ఎల్ సర్కిళ్లలో ఒప్పంద కార్మికులు దాదాపు ఏడాదికాలంగా వేతనాలు అందుకోలేదు. దాదాపు ఒక లక్ష మంది కాంట్రాక్టు కార్మికుల వేతనాలు నాలుగు నెలలుగా పెండింగ్లోనే ఉన్నాయి.
భారత టెలికాం పరిశ్రమ 4జీ స్పెక్ట్రమ్లోకి అడుగిడి సుదీర్ఘకాలం గడిచినా.. బీఎస్ఎన్ఎల్కు కేంద్రం ఇంకా ఆ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరపలేదు. ప్రస్తుతం 5జీ సాంకేతికతను అందిపుచ్చుకునే దశలో టెలికాం పరిశ్రమ ఉండగా.. బీఎస్ఎన్ఎల్ ఇంకా 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసమే ఎదురుచూస్తుండటం కేంద్ర సర్కారు నిర్లక్ష్యపూరిత వైఖరికి నిదర్శనంగా విమర్శలు వస్తున్నాయి.