Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీహార్లో మెదడువాపు వ్యాధి ఉధృతం
- ప్రభుత్వ చర్యలు అంతంత మాత్రమే
పాట్నా: బీహార్లో విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రులు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో 20 రోజుల్లోనే 57మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. చిన్నారుల తల్లిదండ్రులు మొదట్నుంచీ ఇది మెదుడువాపు వ్యాధేనని మొత్తుకున్నప్పటికీ వైద్యాధికారులు మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్లే మృతి చెందుతున్నారని కొట్టిపారేశారు. ఒకే రకమైన లక్షణాలతో వరుసగా చిన్నారులు మృతి చెందినా వాటికి గల కారణాలను విశ్లేషించడంలో ప్రభుత్వం విఫలమైందని చిన్నారుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చిన్నారుల మృతి పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతున్న క్రమంలో దీనిపై బీహార్ ప్రభుత్వం స్పందించింది. 57 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధి వల్లే మరణించారని ఆరోగ్య శాఖ మంత్రి మంగల్ పాండే శుక్రవారం ప్రకటించారు. వీరిలో 47 మంది చిన్నారులు శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఎస్కేఎమ్సీహెచ్)లో మృతి చెందగా, ప్రయివేటు కేజ్రీవాల్ ఆస్పత్రిలో 10 మంది మరణించారని ఆయన వివరించారు. దీనిపై ప్రత్యేక వైద్యబృందం ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తున్నదని అన్నారు. మెదడువాపు వ్యాధి లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆరోగ్య శాఖ పలు కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. రెండు ఆస్పత్రుల్లోనూ పడకల సంఖ్యను పెంచామని వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లోని బాబా రాఘవ్ మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ అందక 60మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. 2017 ఆగస్టులో జరిగిన ఈ హృదయవిదారక ఘటన మరువక ముందే ప్రభుత్వం, ఆస్పత్రుల నిర్లక్ష్యంతో బీహార్లోని ముజఫర్పూర్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.