Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యాయత్నం
ముంబయి : తన ఇంటికి విద్యుత్ కనెక్షన్ అనుమతి కోసం ఆ రైతు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అక్కడుండే అధికారులు ఆయనపై కనికరం చూపలేదు. దీంతో ఆ రైతు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఓట్లు వేసి గెలిపించిన పాల కులకైనా తన సమస్యను తెలియజేయాలనుకున్నాడు. అధికారుల తీరుకు నిరసనగా స్థానికంగా ఒక కార్యక్రమానికి విచ్చేసిన ఇద్దరు రాష్ట్ర మంత్రుల ఎదుటే అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన అధికారులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత రైతు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు అదివారం తెలిపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బుల్ దానా జిల్లాలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వడోదా గ్రామానికి చెందిన రైతు ఇష్వార్ సుపారో ఇంటికి ఏండ్లుగా విద్యుత్ సదుపాయం లేదు. ఇదే సమయంలో మల్కాపూర్ ప్రాంతంలో ఒక అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు రణ్జీత్ పాటిల్, మధన్ ఎరావర్ హాజరయ్యారు. అక్కడకు వచ్చిన ఇష్వార్ సుపారో తన కుటుంబానికి 38 ఏండ్లుగా విద్యుత్ సదుపాయం లేదని, దీనికోసం పర్మిషన్ ఇవ్వాలని పెద్దయెత్తున నినాదాలు చేశాడు. ఆయన ప్రయత్నం ఫలించలేదు. దీంతో వెంటనే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగాడు.