Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొరియర్లుగా పేదింటి యువకులు
- రైళ్లలో గుట్టుగా తరలింపు
విశాఖ : బంగ్లాదేశ్ టు హైదరాబాదు.. వయా విశాఖపట్నం. ఇదీ నకిలీ కరెన్సీ రవాణాకు మాఫియా ఎంపిక చేసుకున్న మార్గం. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ముద్రితమవుతున్న నకిలీ కరెన్సీని మాఫియా కొంత మంది కొరియర్ల ద్వారా రైళ్లలో గుట్టుగా రాష్ట్రాలను దాటించేస్తోంది. కొరియర్లు ఎక్కడైనా పోలీసులకు పట్టుబడినా మాఫియా మూలాలు తెలిసేందుకు వీల్లేకుండా వ్యవహరిస్తుండటంతో నకిలీ కరెన్సీ రవాణా మరింత జోరుగా సాగిపోతోంది. బంగ్లాదేశ్తో పాటు ఆ దేశానికి సరిహద్దున ఉన్న పశ్చిమ బెంగాల్లోని మాల్దా ప్రాంతంలో నకిలీ కరెన్సీని ముద్రిస్తుంటారు. కొన్ని కుటుంబాలు ఇదే వృత్తిగా ఎంచుకున్నాయి. వారితో హైదరాబాద్, ముంబయిలకు చెందిన మాఫియా ముఠాలు అవగాహన కుదుర్చుకుంటున్నాయి. నకిలీ కరెన్సీ రవాణా కోసం యువకులను కొరియర్లుగా ఉపయోగించుకుంటున్నాయి. వీరు సాధారణ ప్రయాణికుల మాదిరిగానే చిన్నపాటి బ్యాగులో నోట్ల కట్టలు తీసుకువెళ్తుండటంతో పోలీసులకు కూడా అనుమానం కలగడం లేదు. ఏదైనా నిర్దిష్టమైన సమాచారం వచ్చినప్పుడు తప్పితే నకిలీ నోట్ల గుట్టును పోలీసులు బట్టబయలు చేయలేకపోతున్నారు.
రైల్వే స్టేషన్లోనే బ్యాగుల మార్పిడి
నకిలీ నోట్ల రవాణా, చెలామణి మాఫియా తాము నియమించుకున్న కొరియర్లను మార్చేందుకు విశాఖ రైల్వేస్టేషన్ను కేంద్రంగా చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. విశాఖ ప్రశాంతమైన నగరం కావడం, రైల్వేస్టేషన్ నిత్యం రద్దీగా ఉండడం దీనికి కారణంగా భావిస్తున్నారు.
మాఫియా నియమించుకున్న కొరియర్లలో మొదటి వ్యక్తి మాల్దా నుంచి విశాఖ వరకూ తీసుకువచ్చి ఇక్కడ మరొక కొరియర్కు బ్యాగును అందజేస్తాడు. బ్యాగు తీసుకున్న వ్యక్తి అదే రైలులో విజయవాడ వెళ్లి అక్కడ మరొకరికి అప్పగిస్తాడు. అక్కడి నుంచి బ్యాగు తీసుకున్న వ్యక్తి హైదరాబాద్ చేరుస్తాడు. గత మూడేండ్లలో విశాఖపట్నం టాస్క్ఫోర్స్ పోలీసులు ఎనిమిది కేసుల్లో 19 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.47.32 లక్షల నకిలీ కరెన్సీతోపాటు ఒక రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా విశాఖ రైల్వేస్టేషన్లో రూ.4.2 లక్షలు విలువైన నకిలీ రూ.2వేల నోట్లు కలిగి ఉన్న హైదరాబాద్ వాసి మహ్మద్ ముబీనాను అదుపులోకి తీసుకోవడంతో నకిలీ నోట్ల రవాణా మాఫియా విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
నిరుపేద యువకులే టార్గెట్
నకిలీ కరెన్సీ రవాణా, చెలామణికి మాఫియా నిరుపేద యువకులను ఎంపిక చేసుకుంటోంది. టీ దుకాణాలు, టిఫిన్ సెంటర్లలో సర్వర్లుగా పనిచేసే యువకులతో మాటలు కలిపి, 'ఎన్నాళ్లు పనిచేస్తే రూ.20 వేలు సంపాదించగలవు. ఒకసారి పశ్చిమ బెంగాల్ వెళ్లి వచ్చావంటే చాలు... రూ.20 వేలు చేతికి అందుతుంది...' అంటూ ఉచ్చులోకి లాగుతున్నారు. మొదటిసారి నిరాకరించినా పదేపదే అదే దుకాణం వద్దకు వెళ్లి తమ ముగ్గులోకి వచ్చేలా మాటలతో మభ్య పెడతారు. దీంతో డబ్బు వస్తుందనే ఆశతో మాఫియా చెప్పినట్లు చేయడానికి అంగీకరిస్తారు. కొరియర్గా ముందుకువచ్చిన వ్యక్తికి రైలు టిక్కెట్తో పాటు అక్కడ ఎవరితో మాట్లాడాలో సూచిస్తూ ఒక ఫోన్ నంబరు మాత్రమే అందజేస్తారు. తమ వివరాలు గానీ, ఎదుటివారి వివరాలు గానీ వెల్లడించరు. ఒకవేళ ఎక్కడైనా పోలీసులకు చిక్కినా తెరవెనుక ఉన్న వ్యక్తి వివరాలు మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
అప్రమత్తమయ్యాం
విశాఖ మీదుగా నకిలీ నోట్ల రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో అప్రమత్తమై ఇటీవల ఒకరిని అదుపులోకి తీసుకున్నాం. కేసును ఇక్కడితో వదిలేయకుండా నకిలీ నోట్ల రవాణాకు సంబంధించిన పూర్తి నెట్వర్క్ గుర్తించి మూలాలను బయటకు తీస్తాం. అసలు నిందితులను కూడా జైలుకు పంపేలా చర్యలు తీసుకుంటాం.
- ఎం.మహేందర్ ఏసీపీ, టాస్క్ఫోర్సు విశాఖ.