Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో మదర్సా టీచర్ల గోస
- మూడున్నరేండ్లుగా జీతాలు చెల్లించని కేంద్రం
- తీవ్ర ఇబ్బందుల్లో ఉపాధ్యాయులు
- ఆధునీకరిస్తామంటూనే ఆదరించలేకపోతున్న బీజేపీ సర్కారు
లక్నో : ముస్లిం చిన్నారులు చదువుకునే మదర్సాలను ఆధునీకరిస్తామని, అక్కడ చదివే విద్యార్థులకు సైతం కంప్యూటర్, ఆంగ్లం, గణితం వంటివి బోధిస్తామని చెబుతున్న మోడీ సర్కారు వాటిలో పనిచేసే ఉపాధ్యాయుల జీతాలను మాత్రం మూడున్నరేండ్లుగా చెల్లించడం లేదు. దీంతో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని 8,554 ప్రభుత్వ గుర్తింపు పొందిన మదర్సాలలో పనిచేసే దాదాపు 25,550 మంది ఉపాధ్యాయులు 2016 నుంచి వేతనాల్లేక దినదిన గండంలా బతుకులీడుస్తున్నారు. దాదాపు మూడున్నరేండ్లుగా కేంద్ర ప్రభుత్వం వీరికి వేతనాలు చెల్లించకపోవడంతో వారంతా బతుకుదెరువు కోసం మిగతా పనులు చూసుకుంటున్నారు. కేంద్రంతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర సర్కారు సైతం కేంద్ర సర్కారునే అనుసరిస్తూ వీరికి జీతాలు చెల్లించడంలో మీన మేషాలు లెక్కిస్తున్నది. ఇదిలాఉంటే మదర్సాలలో పనిచేస్తున్న వారికే జీతాలు చెల్లించని మోడీ సర్కారు.. వాటిని ఆధునీకరించడం నమ్మదగినదిగా లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
రాష్ట్ర మైనారిటీ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నివేదిక ప్రకారం.. 2016 నుంచి మదర్సాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కేంద్రం నుంచి రావాల్సిన రూ. 550 కోట్లు, రాష్ట్రం నుంచి రావాల్సిన రూ. 11 కోట్లు పెండింగ్లోనే ఉన్నాయి. మదర్సాలలో పనిచేస్తున్న వారిలో డిగ్రీలు చేసినవారు 9,946 మంది ఉండగా.. 15,605 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మూడున్నరేండ్లుగా జీతాలు చెల్లించకపోవడంతో వీరంతా అక్కడ పనిచేయడం మాని ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.
నాటి నుంచే ప్రయత్నం...
మదర్సాలలో బోధించే మత సంబంధ విషయాలే గాక సాధారణ పాఠశాలల్లాగే అక్కడ కూడా ఆధునిక విద్యను బోధించాలని 1993-94లో నాటి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అప్పటి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ) మంత్రి అర్జున్ సింగ్ నేతృత్వంలో దీనికి బీజాలు పడ్డాయి. దీనికోసం దేశవ్యాప్తంగా ఉన్న మదర్సాలలో గణితం, ఆంగ్లం, సామాన్యశాస్త్రం వంటివి బోధించేవారిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు. రూ. 2,250 వేతనంతో ప్రతి మదర్సాలో ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున నియమించారు. అప్పటికీ యూపీలో 750 మదర్సాలున్నాయి. అనంతరం 2000లో అప్పటి వాజ్పేయి ప్రభుత్వం ప్రతి మదర్సాకు మరో ఇద్దరు టీచర్లను పెంచడమే గాక గ్రాడ్యుయేట్లకు రూ. 3 వేలు, పోస్టు గ్రాడ్యుయేట్లకు రూ. 4 వేల వేతనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగుతున్న ఖర్చులకనుగుణంగా తమ జీతాలు పెరగడం లేదని ఆగ్రహించిన మదర్సా ఉపాధ్యాయులు నిరసనలు చేపట్టారు. దీంతో అప్పటి మన్మోహన్ సింగ్ సర్కారు వారి వేతనాలను రూ. 6 వేలు, రూ. 12 వేలకు పెంచింది. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఐదేండ్లు పూర్తయినా ఒక్క పైసా జీతం పెరచకపోగా.. మూడున్నరేండ్లుగా వారికి వేతనాలు సైతం చెల్లించకపోవడం గమనార్హం. అంతేగాక నలుగురు ఉపాధ్యాయులున్న మదర్సాల నుంచి ఒక్కో టీచర్ను తొలగించిందీ బీజేపీ సర్కారు. మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ హయాంలో తమకు నెలనెలా వేతనాలు అందేవని.. కానీ, యోగి సర్కారు వచ్చిన తర్వాత గత ఆరునెలలుగా రాష్ట్ర ప్రభుత్వం సైతం తమను పట్టించుకోవడం లేదని ఆలిండియా మదర్సా మోడ్రనైజేషన్ టీచర్స్ అసోసియేషన్ (ఎంఎంటీఎ) కో ఆర్డినేటర్ బద్రే ఆలం ఆరోపించారు.
వైద్య ఖర్చులకే సరిపోవట్లేదు
నేను కొన్నేండ్లుగా మదర్సాలో కంప్యూటర్, గణితం బోధిస్తున్నాను. మూడున్నరేండ్లుగా కేంద్రం మాకు వేతనాలు చెల్లించకపోవడంతో మా బతుకులు దుర్భరమయ్యాయి. నా నాలుగేండ్ల కొడుకు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. బయిట ట్యూషన్లు చెప్పి వచ్చిన డబ్బులతో నా కొడుకు వైద్యం చేయిస్తున్నాను. ప్రభుత్వం మా జీతాలు చెల్లించకుంటే మేం ఎలా బతికేది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మదర్సాలను ఆధునీకరిస్తామని మోడీ చెప్పారు. కానీ దాని గురించి పట్టించుకున్న దాఖలాల్లేవ్. ఇప్పుడు ఆయన చెబుతున్న మాటలు కూడా అదే విధంగా ఉన్నాయి.
- ఆసిఫ్ మహ్మద్, గోరఖ్పూర్