Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు, రేపు లోక్సభ సభ్యుల ప్రమాణస్వీకారం
- 19న స్పీకర్ ఎన్నిక... 20న రాష్ట్రపతి ప్రసంగం
- జులై 4న ఆర్థిక సర్వే విడుదల... 5న కేంద్ర బడ్జెట్
- ప్రధాని మోడీ నేతృత్వంలో అఖిలపక్షం
- ప్రజాసమస్యలపైనే మా పోరాటం: పీఆర్ నటరాజన్, సీపీఐ(ఎం)
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
17వ లోక్సభ సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాలు నేటి(సోమవారం) నుంచి షురూ కానున్నాయి. ఈ సమావేశాలు జులై 26 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. మొదటి రెండు రోజులు లోక్సభ ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ లోక్సభ సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. అటుతర్వాత స్పీకర్ ఎన్నిక కూడా ప్రొటెం స్పీకరే నిర్వహిస్తారు. 19న లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక ఉంటుంది. 20న భారత రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఏర్పాటు చేసి ప్రసంగిస్తారు. ఆ రోజు నుంచి రాజ్యసభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానంపై చర్చ జరుగుతుంది. జులై 4న ఆర్థిక సర్వే, 5న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. లోక్సభ, రాజ్యసభల్లో కేంద్ర బడ్జెట్పై చర్చ జరుగుతుంది. ఈ సమావేశాల్లో త్రిపుల్ తలాక్ బిల్లు, ఆధార్ సవరణ బిల్లు, కేంద్ర విద్యా సంస్థల(ఉపాధ్యాయుల రిజర్వేషన్) బిల్లు వంటి కీలక బిల్లుల ఆమోదంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. పార్లమెంట్ సమావేశాలు 39 రోజుల పాటు జరగనున్నాయి. అందులో 31 రోజులు సభా కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్లో అఖిల పక్ష సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ రాజ్యసభ నేత తావర్ చంద్ గెహ్లాట్, పీఆర్ నటరాజన్(సీపీఐ(ఎం)), డీి.రాజా(సీపీఐ), గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, అదిర్ అంజన్ చౌదరి(కాంగ్రెస్), సుదీప్ బందోపాధ్యయ, డెరిక్ ఓబ్రయిన్(టీఎంసీ), ఫరూక్ అబ్దూల్లా(నేషనల్ కాన్ఫెరెన్స్), రాం గోపాల్ యాదవ్(ఎస్పీ), సుప్రియా సులే(ఎన్సీపి), విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి(వైసీపీ), గల్లా జయదేవ్, సీఎం రమేష్, కె.రామ్మోహన్ నాయుడు(టీడీపీ), కేశవరావు, నామా నాగేశ్వరావు(టీఆర్ఎస్), అనుప్రియా పటేల్(అప్నాదళ్), సంజరు సింగ్(ఆప్), కున్హల కుట్టి(ఐయుఎంఎల్) తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా నిర్వహించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు చర్చించాయి. కీలకమైన బిల్లులను ఆమోదించేందుకు ప్రతిపక్షం సహకరించాలని కేంద్రం కోరింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ''కొత్త ముఖాలు పార్లమెంట్కు వచ్చాయి. కొత్త ఆలోచనలు చేయాలి'' అని ఫోర్ లీడర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజల కోసం మనం ఉన్నామనీ, అందుకే విభేదాలను పక్కన పెట్టి దేశ ప్రగతి కోసం పని చేయాలని సూచించారు. ''అన్ని పార్టీల నేతలు చాలా విలువైన సలహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. పార్లమెంట్ను సజావుగా నిర్వహించేందుకు అందరు అంగీకరించారు. ప్రజల ఆకాంక్షలను మేము నెరవేర్చుతాం'' అని మోడీ బదులిచ్చారు. 2022 నాటికి నవ భారత్ నిర్మాణానికి అందరం అడుగేయాలని, అందుకు అందరి సలహాలు, సూచనలు అవసరమని అన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సమావేశం ముగిసిన తరువాత రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ తాము అన్ని బిల్లులను వ్యతిరేకించమనీ, ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించే బిల్లులపై లోతైన చర్చ అవసరమని వ్యాఖ్యానించారు. దేశంలో రైతాంగం దుస్థితి, నిరుద్యోగం, కరవు, మీడియా స్వేచ్ఛ, సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ సంస్థల నిర్వీర్యం, మహిళా భద్రత, ధరలు పెరుగుదల వంటి అంశాలపై చర్చకు లేవదీస్తామని తెలిపారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు అభినందనలు తెలుపుతున్నాయని, అలాగే తమ సైద్ధాంతిక పోరాటం కొననసాగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకాశ్మీర్కు అసెంబ్లీ ఎన్నికలు త్వరగా నిర్వహించాలనీ, లోక్సభ ఎన్నికలు నిర్వహించినప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పాలనతో రాష్ట్రాన్ని పాలించాలని చూస్తోందని ఆరోపించారు. టీఎంసీ నేత డెరిక్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ సమాఖ్య వ్యవస్థపై దాడి జరుగుతుందని, కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల్లో ప్రభుత్వం ఖర్చు, బ్యాలెట్ పేపర్ వంటి అంశాలపై తాము లేవనెత్తుతామని అన్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేశవరావు సమావేశంలో మాట్లాడుతూ... చట్ట సభల్లో అర్థవంతమైన సమావేశం జరగాలని అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక హోదాపై పట్టు : విజయసాయి రెడ్డి, వైసీపీ
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలు చేయాలని అఖిలపక్షంలో లేవనెత్తామని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. అఖిలపక్ష సమావేశం అనంతరం విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసినట్టు వివరించారు. దీనికోసం అవసరమైతే రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ను సవరించాలని కోరామన్నారు. గతంలోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కోసం రాజ్యసభలో తాను ప్రయివేట్ మెంబర్ బిల్లు పెట్టామని గుర్తు చేశారు. పార్లమెంట్ సజావుగా జరిగేలా చట్టం తేవాలన్నారు. సమావేశాలను అడ్డుకునేవారిపై చట్టబద్ధంగా జీతభత్యాలు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానిని అడిగినట్టు చెప్పారు. వైసీపీి లేవనెత్తిన అంశాలకు ఇతర రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయని వివరించారు. అవసరాన్ని బట్టి దేశానికి ఉపయోగపడే అంశాలకు వైసీపీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ఉభయ సభల్లో అర్థవంతమైన చర్చ జరగాలని వైసీపీ కోరుకుంటోందని అన్నారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్పై తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు. ప్రత్యేక హోదానే తమ పార్టీ ప్రధాన ఎజెండా అని, అది వచ్చిన తరువాతే మిగిలిన అంశాల గురించి పరిశీలిస్తామని పేర్కొన్నారు.
విభజన హామీలు అమలు చేయాలి: గల్లా జయదేవ్, టీడీపీ
విభజన హామీలను అమలు చేయాలని టీడీపీి పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని, బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పారు. ప్రతిపక్షాల బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో చర్చల సందర్భంగా కొంత ఎక్కువ సమయం కేటాయించాలని కోరామన్నారు.
ప్రజా సమస్యలపై నిలదీస్తాం
17వ లోక్సభను బీజేపీ సర్కారు సజావుగా నిర్వర్తించాలని... దేశంలో ప్రజా సమస్యలపై చర్చించాలని సీపీఐ(ఎం) లోక్సభ పక్షనేత పీఆర్ నటరాజన్ డిమాండ్ చేశారు. వ్యవసాయ సంక్షోభం, రైతాంగ సమస్యలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, దళిత, మైనార్టీ, మహిళలపై దాష్టీకాలు, సమాఖ్య వ్యవస్థపై దాడి, రాజ్యాంగ సంస్థల ఉనికి ప్రశ్నార్థకం వంటి సమస్యలపై చర్చ అనివార్యమని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) ఇతర వామపక్షాల తరఫున పది అంశాలపై తక్షణమే సభ చర్చించాల్సి ఉన్నదని అఖిలపక్ష సమావేశానికి ఆయన వివరించారు. గత లోక్సభలో కూడా పెద్దగా ప్రజా ఉపయోగ చర్చలు జరగలేదని వివరించారు. కనీసం ఈ సభ అయినా, ప్రజా సమస్యల చర్చకు అనువైన వేదిక కావాలని ఆకాంక్షించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనేక బిల్లులను ఆమోదించేందుకు ప్రతిపాదిస్తుందని, కానీ మహిళ రిజర్వేషన్ బిల్లు మాత్రం తీసుకురావటం లేదని విమర్శించారు. నటరాజన్ ప్రశ్నకు సమావేశంలోనే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకున్నామని అన్నారు. సభా నిర్వహణ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
- పీఆర్ నటరాజన్, సీపీఐ(ఎం)
ఐదు అంశాలపై19న అన్ని పార్టీల అధ్యక్షులతో భేటీ
పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉన్న అన్ని పార్టీల అధ్యక్షులతో ఈ నెల 19న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఐదు అంశాల ఎజెండాపై ఈ సమావేశం జరగనుంది. ''ఒకే దేశం, ఒకే ఎన్నికలు. పార్లమెంట్ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు చర్యలు. 75 ఏండ్ల స్వాతంత్య్రం సందర్భంగా నవ భారత్ నిర్మాణం. మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకలు నిర్వహణ. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి'' వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్ని పార్టీ అధ్యక్షులకు ఆహ్వాన లేఖలు రాశారు. జూన్ 20 లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు ప్రధాని మోడీ విందు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.