Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్యమవుతున్న విత్తనాల నాటు ప్రక్రియ
ఇప్పటికే రెండు వారాల జాప్యం
న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాల మందగమనంతో దేశవ్యాప్తంగా విత్తనాల నాటు ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. వారం రోజులు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకిన రుతు పవనాలు.. ఇంకా పూర్తి స్థాయిలో దేశమంతటా విస్తరించలేదు. దీంతో వేసవికాలం ముగింపు దశలో విత్తాల్సిన పలు పంటలు ఆలస్యమవుతున్నాయి. ముఖ్యంగా రెండు వారాల క్రితమే విత్తాల్సి ఉన్న సోయాబిన్, పత్తి, వరి, మొక్కజొన్న విత్తనాలు.. వర్షాలు కురవకపోవడంతో ఇంకా విత్తలేదు. కాగా వచ్చే పదిరోజుల్లో వర్షాలు పడకపోతే ఆ ప్రభావం పంటల దిగుబడిపై పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 2.3 కోట్ల ఎకరాలలో మాత్రమే రైతులు విత్తనాలు వేశారు. ఇది గతేడాదితో పోల్చితే 9 శాతం తక్కువ. సోయాబిన్ గతేడాది కంటే 51 శాతం తక్కువగా నాటగా.. పత్తి విత్తనాలను సైతం 9.4 శాతం తక్కువగా విత్తారు. సోయాబిన్ అధికంగా పండించే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగానే అక్కడ విత్తనాల నాటు ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మొక్కజొన్న ఎక్కువగా పండిచే కర్నాటకలో సైతం ఇంకా కరువు తాండవిస్తున్న నేపథ్యంలో అక్కడా సాగు ముందుకు సాగడం లేదు.
జూన్లో కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే 43 శాతం తక్కువగా నమోదవ్వడం కూడా విత్తనాల నాటుకు ఆటంకం కలిగిస్తోంది. మహారాష్ట్రలో 63 శాతం వర్షపాత లోటు ఉండటం ఆందోళన కలిగించే అంశమని వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు చెబుతున్నారు. జూన్ మధ్య నాటికి దేశమంతా విస్తరించాల్సిన నైరుతి రుతు పవనాలు అరేబియా సముద్రంలో ఏర్పడ్డ 'వాయు' తుఫాను కారణంగా మరింత ఆలస్యమవుతున్నాయని ఐఎండీ తెలిపింది.
వాయు తుఫాన్ వల్లే ఇదంతా : భారత వాతావరణ శాఖ
రుతుపవనాల రాకను అరేబియా వాయు తుఫాన్ అడ్డుకుందనీ, తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టగానే వర్షాలు ప్రారంభమవుతాయనీ భారత వాతా వరణ శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ దేవేంద్ర ప్రధాన్ చెప్పారు. తాజా బులెటిన్ విడుదల చేస్తూ, ''మధ్య అరేబియా ప్రాంతానికి సమీపంగా నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో తమిళనాడు, కర్నాటకతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి''అని ఆయన అన్నారు.