Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉభయ సభల డిమాండ్
- హామీని నిలబెట్టుకోలేని పార్లమెంటుకు 'ఆ' హక్కు న్యాయమేనా?: శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన జగన్
అమరావతి : రాష్ట్రానికి తక్షణమే ప్రత్యేకహోదా ప్రకటించాలని ఉభయసభలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం శాసనసభ, శాసనమండలిలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ' ప్రత్యేకహోదానే రాష్ట్రానికి జీవనాడి అని స్పష్టం అయిన నేపథ్యంలో రాష్ట్రానికి ఇక జాప్యం లేకుండా ప్రత్యేకహోదా ఇవ్వాలి' అని తీర్మానంలో పేర్కొన్నారు. '5కోట్ల ప్రజల తరపున ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నట్టు జగన్మోహన్రెడ్డి తెలిపారు. అదే సమయంలో ' హోదా ఇస్తామన్న ముందస్తు హామీతో రాష్ట్రాన్ని విభజించి, ఆ హామీని నిలబెట్టుకోలేని పార్లమెంటుకు రాష్ట్రాన్ని విభజించే హక్కు ఉండటం న్యాయమేనా? అని తీర్మానంలో ప్రశ్నించారు. తొలుత తెలుగులోనూ, ఆ తరువాత ఇంగ్లీషులోనూ తీర్మాన పూర్తి పాఠాన్ని ఆయన చదివారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతల మధ్య మరోసారి మాటల యుద్ధం సాగింది.
29సార్లు ఢిల్లీ వెళ్లా.... బాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ హోదా కోసం ఎంతో చేశానని, 29 సార్లు ఢిల్లీ వెళ్ళానని చెప్పారు. 'హోదా కోసం ఏంతో చేశా... ఎందరినో కలిశా' అని అన్నారు. ఢిల్లీలో మంత్రులందరికీ వినతిపత్రాలు సమర్పించానని అయినా ఫలితం కనడపలేదని అన్నారు. ప్రస్తుత అధికారంలో ఉన్న వ్యక్తులు తీసుకొస్తే సంతోషమేనని, తీర్మానానికి తామంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతున్నామని అన్నారు. తమపై విమర్శలు చేస్తే భవిష్యత్లో అదే పరిస్థితి అధికారపక్షానికి వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు.
అన్నీ అబద్ధాలే... జగన్
ప్రత్యేకహోదాపై చంద్రబాబు చెబుతన్నవన్ని పచ్చి అబద్ధాలు అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు. చంద్రబాబు వల్లే హోదా రాలేదన్నారు. ప్లానింగ్ కమిషన్ను ఉన్నన్ని రోజులు హోదా గురించి పట్టించుకోలేదని చెప్పారు. ప్లానింగ్ కమిషన్ను హోదా అడగడంలో విఫలమైనారని విమర్శించారు. ఏంతో చేశానని ఇప్పుడు చెబుతున్న మాటాలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయన్నారు. 'బాబూ.. హోదా ఏం పాపం చేసింది? ఎందుకు వద్దన్నావు.. ప్యాకేజికి ఎందుకు ఒప్పుకున్నావు?' అని ప్రశ్నించారు. జగన్ ఈ మాటలు అంటున్నప్పుడు అధికార పక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో నిరసన తెలపడం కనిపించింది.
హోదా కేసులు ఎత్తేయాలి : పీడీఎఫ్
మండలిలో ప్రత్యేక హోదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం ఉప ముఖ్యమంత్రి సుభాష్చంద్రబోస్ వివరణ ఇచ్చారు. దీనిపై పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, యండపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకహోదా ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని ప్రభుత్వానికి వారు సూచించారు.