Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక విదేశాల్లోనూ దర్యాప్తు
- బిల్లుకు లోక్సభ ఆమోదం
- దుర్వినియోగం చేస్తారని ప్రతిపక్షం ఆందోళన
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులపై విదేశాల్లో జరిగే దాడులపై సైతం దర్యాప్తు చేసేందుకు వీలుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు ప్రత్యేకాధికారాలను కల్పిస్తూ సవరించిన ఎన్ఐఏ చట్టసవరణ బిల్లుకు లోక్సభ సోమవారం ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన హోం మంత్రి అమిత్షా మాట్లాడుతూ ఈ బిల్లును దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయన్న ప్రతిపక్ష ఆందోళనలను కొట్టిపారేశారు. మతం పేరుతో ఈ బిల్లును ప్రభుత్వం ఎన్నడూ దుర్వినియోగం చేయబోదని, అంతేకాక మతం ఏదైనా ఈ చట్టం ద్వారా ఉగ్రవాదాన్ని రూపుమాపటమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గతంలో వాజ్పేయి హయాంలో అమలులోకి వచ్చిన పోటా చట్టాన్ని దుర్వినియోగం సాకుతో కేవలం ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే గత యూపీఏ సర్కారు రద్దు చేసిందని అమిత్షా విమర్శించారు. పోటా చట్టాన్ని రద్దు చేసిన తరువాత ఉగ్రవాద దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. ఈ చట్టాన్ని రద్దు చేసిన యూపీఏ సర్కారు 2008 నాటి ముంబయి ఉగ్రదాడుల తరువాత ఎన్ఐఏను ఏర్పాటుచేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రతిపాదిత చట్టానికి అన్ని పార్టీలూ మద్దతునివ్వాలన్న అమిత్షా, ఇందులో విభేదాలు పొడసూపితే అది ప్రజలకు తప్పుడు సంకేతాలను పంపటంతో పాటు ఉగ్రవాదులకు నైతిక బలాన్నిస్తుందని అన్నారు. ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రతీకారం కోసం వినియోగిస్తోందంటూ పలువురు ప్రతిపక్ష నేతలు ఈ బిల్లుపై తీవ్ర విమర్శలుగుప్పించారు. దీనిపై స్పందించిన హోం మంత్రి తమ ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశాలేవీ లేవని, ఉగ్రవాదాన్ని అంతం చేయటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. నిందితులపై చర్యలు తీసుకునే విషయంలో వారిది ఏ మతమన్న విషయాన్ని కూడా చూడబోమనివివరించారు.