Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ అధికారుల విధులకు భంగం కలిగించారంటూ..
- ఎఫ్ఐఆర్లో గిరిజనుల పేర్లు
- పోరుబాట పట్టిన అడవి బిడ్డలు
భోపాల్ : అడవుల నుంచి తమను వెళ్లగొడితే చూస్తూ ఊరుకునేది లేదని నిరసిస్తూ పోలీసుల పెల్లెట్లను సైతం తట్టుకున్న గిరిజనులపైనే కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లా సివాల్ గ్రామంలో నివసిస్తున్న ఆదివాసీలపై ఇటీవల అటవీ పోలీసులు పెల్లెట్ల వర్షం కురిపించిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలైన విషయం విదితమే. కాగా, ఈ ఘటనలో అటవీ అధికారుల విధులకు భంగం కలిగించారంటూ ఆరోపిస్తూ గిరిజనులపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 9న సివాల్ గ్రామానికి వెళ్లిన అటవీ అధికారులు.. ఏండ్లుగా అడవిలో ఉంటున్న గిరిజనులను తక్షణమే అక్కడి నుంచి ఖాళీ చేయాలని ఆదేశించారు. వారి పంటలను ప్రొక్లేయినర్లతో ధ్వంసం చేశారు. దీనిని నిరసిస్తూ ఆందోళన చేసిన దాదాపు 200 మంది గిరిజనులపై అటవీ పోలీసులు పెల్లెట్ల వర్షం కురిపించారు. అయితే ఈ ఘటనపై గిరిజనులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారుల పేర్లను ఎఫ్ఐఆర్లో తొలగించిన పోలీసులు.. గిరిజనుల పేర్లను చేర్చారు. 20 ఏండ్ల క్రితమే చనిపోయిన ఆదివాసీల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చడం గమనార్హం. కాగా దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీలు భగ్గుమంటున్నారు. జిల్లాలో ఉన్న ఆదివాసీ సంఘాలన్నీ ఒక్కతాటి మీదకు వచ్చి బుర్హాన్పూర్ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగాయి. తక్షణమే తమపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని వారంతా కలెక్టర్ను డిమాండ్ చేశారు. దీనిపై జాగృతి ఆదివాసీ దళిత్ సంఘటన్ అధ్యక్షురాలు ధీనాభారు మాట్లాడుతూ.. 'అటవీ అధికారులను మేం ఎప్పుడైనా ఏమైనా అడిగామా..? మాకు ఉద్యోగాలు కావాలన్నామా..? మా పంటలను మీరెలా ధ్వంసం చేస్తారు..? ఆదివాసీలను చంపాలనుకుంటే చంపండి..! మా భూముల కోసం మేం చావడానికైనా సిద్ధం. మా హక్కులను సాధించుకోవడం కోసం చావుకు భయపడం. మా వద్దకు 40 వాహానాలను తీసుకుని రావాల్సిన అవసరం ఏమొచ్చింది. మమ్మల్ని కాల్చడానికేనా..? మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక సుప్రీంకోర్టు ఆదేశాలను చూపి తమను అడవులనుంచి వెళ్లగొట్టాలని చూస్తే త్వరలోనే చూస్తూ ఊరుకునేది లేదనీ, దానిపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఇదే విషయమై త్వరలోనే నిరాహార దీక్ష చేపడతామని ఆదివాసీ సంఘాల నాయకులు ప్రకటించారు.